యోగానందగారు మరియు భగవద్గీత

యోగానందగారు మరియు భగవద్గీత

పరమహంస యోగానందగారు రచించిన
గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) కు
శ్రీ శ్రీ దయామాత యొక్క ముందుమాట నుండి

“మానవాళికి సత్యాలను ఎంతోకొంత వెల్లడించకుండా ఏ సిద్ధుడూ కూడా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడు. ప్రతీ విముక్తాత్మ తన దైవ-సాక్షాత్కారపు వెలుగును ఇతరులపై ప్రసరించవలసి ఉంటుంది.” పరమహంస యోగానందగారు ఈ బాధ్యతను తన ప్రపంచ కార్య ప్రారంభంలో పవిత్ర గ్రంథాల మీద వ్యాఖ్యానించడం ద్వారా ఎంతో ఉదారంగానో నెరవేర్చారు! — ఆయన ప్రపంచ కార్యక్రమము మొదటిలో పలికిన ఆధ్యాత్మిక పదాలతో. వారసత్వంగా కేవలం తన రచనలు మరియు ఉపన్యాసాలను అందించినా, దివ్య కాంతిని ఉదారంగా అందించిన మహాత్మునిగా ఆయన సరియైన స్థానం పొందారు. ఆయన యొక్క దైవ సంసర్గం నుండి విస్తృతంగా ప్రవహించిన సాహిత్య రచనలలో, భగవద్గీత అనువాదం మరియు వ్యాఖ్యానం ఆ సద్గురువు యొక్క అత్యంత సమగ్రమైన సమర్పణగా పరిగణించబడుతుంది – కేవలం పరిమాణంలో మాత్రమే కాక, దాని సర్వ-గ్రాహకమైన అవగాహన పరంగా కూడా….

గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న ధ్యానయోగ శాస్త్రంలో పరమహంసగారు పూర్తి ప్రావీణ్యం కనబరిచారు. ఆయన సర్వోత్కృష్టమైన సమాధి స్థితిలోకి ఎంత అప్రయత్నంగా ప్రవేశించేవారో నేను చాలా తరచుగా గమనించాను; అప్పుడు ఆయన దగ్గరున్న ప్రతి ఒక్కరం ఆయన దైవ-సంసర్గం నుండి వెలువడిన అనిర్వచనీయమైన ప్రశాంతత మరియు ఆనందంలో తడిసిపోయేవాళ్ళం. కేవలం ఒక స్పర్శ ద్వారా, పదం ద్వారా లేదా ఒక చూపు ద్వారా, ఆయన దైవ సాన్నిధ్యమనే ఉన్నత అవగాహనను మేల్కొల్పగలిగేవారు, లేదా అధిచేతన పారవశ్య ఆనంద అనుభవాన్ని తనతో అనుసంధానంలో ఉన్న శిష్యులకు ప్రసాదించేవారు.

ఉపనిషత్తులలోని ఒక భాగం మనకు ఇలా బోధిస్తుంది: “ఎడతెగని ధ్యానానికి ఫలమైన బ్రహ్మానందం అనే అమృతాన్ని మాత్రమే గ్రోలడంలో నిమగ్నమై ఉన్న జ్ఞానియే ప్రాపంచిక కళంకం లేని తత్వవేత్త, అతనే అత్యుత్తమ సాధువు, పరమహంస మరియు అవధూత. ఆయన దర్శనమాత్రం చేత ప్రపంచం మొత్తం పవిత్రం అవుతుంది. ఆయన సేవకు అంకితమయిన అజ్ఞాని కూడా విముక్తి పొందుతాడు.”

పరమహంస యోగనందగారు నిజమైన సద్గురువుకు నిర్వచనంగా తగినవారు, ఆయన దైవ-సాక్షాత్కారం పొందిన గురువు; జ్ఞానం, కర్మ మరియు దేవునిపై ప్రేమకు ఒక సజీవ గ్రంథం వంటివారు. గీతలో తెలిపిన విధముగా, ఆయన యొక్క పరిత్యాగం మరియు సేవా, స్ఫూర్తి, ప్రాపంచిక విషయాలపై మరియు వేలాదిమంది అనుచరుల చూపించే ప్రశంసలపై పూర్తి వైరాగ్యంతో ఉండేది. ఆయన యొక్క అజేయమైన అంతరిక బలం మరియు ఆధ్యాత్మిక శక్తి, మధురమైన సహజ-వినయంలో నివసించేవి, దానిలో స్వార్థపూరిత అహం నివసించడానికి చోటు లేదు. ఆయన తన గురించి కానీ, తన పనిని గురించి కానీ ప్రస్తావించినప్పుడు కూడా అది వ్యక్తిగత సాఫల్య భావన లేకుండా ఉండేది. నిజమైన ఆత్మ-సారమైన భగవంతుని అంతిమ సాక్షాత్కారం పొందిన ఆయన, అంతటా ఉన్నది తానుగా తప్ప ఏది అన్యమైనది కాదని ఆయనకి తెలుసు.

గీతలో అర్జునుడికి కృష్ణుడు వెల్లడిచేసిన అత్యున్నత అధ్యాయం పదకొండు (XI)లో “విజన్ ఆఫ్ విజన్స్” యందు భగవంతుడు తన విశ్వరూపాన్ని వెల్లడిస్తాడు: అనూహ్య-విస్తారం గల విశ్వాలపై విశ్వాలు, వాటిని సృష్టించి నిలబెడుతున్న అనంత-సర్వశక్తికి, అత్యంత్త చిన్న కణమైన పరమాణు పదార్థం గురించి మరియు నక్షత్ర మండలాల విస్తారమైన విశ్వ కదలికల గురించి – ప్రతి భౌతిక మరియు స్వర్గ లోక జీవి యొక్క ప్రతీ ఆలోచన, భావం మరియు చర్య గురించి ఏకకాలంలో తెలుసు.

పరమహంస యోగానందగారు అలాంటి విశ్వ దర్శనంతో ఆశీర్వదించబడినప్పుడు ఆయన సర్వ-వ్యాపక తత్వానికి, తద్వారా ఆయన యొక్క అధ్యాత్మిక ప్రభావానికి మేము సాక్షులుగా ఉన్నాము. జూన్ 1948లో, ఒకనాటి సాయంత్రము నుండి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు, మాలో కొంతమంది శిష్యులు ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని విశ్వ ఆవిష్కరణం గురించి అది వెల్లడి అవుతున్న ప్రకారం ఆయన పారవశ్యమైన వర్ణన ద్వారా చూడగలిగాము.

ఆ విస్మయపరిచే సంఘటన భూమిపై ఆయన సమయం ముగుస్తుందని ముందే తెలియచెప్పింది. దీని తరువాత, పరమహంసగారు మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతంగా ఉండడం ప్రారంభించారు, తన రచనలను పూర్తి చేయడానికి ఆయనకి మిగిలి ఉన్న సమయాన్ని సాధ్యమైనంత ఎక్కువగా కేటాయించారు. ఆయన ప్రపంచానికి అందించదలచిన సాహితీ సందేశంపై ఏకాగ్రతగా ఉన్న ఆ కాలంలో ఆయన సమక్షంలో ఉన్న మాకు విశేష సమయం అనే చెప్పాలి. ఆయన పూర్తిగా అంతర్ముఖులై, తాను ఆంతరికంగా గ్రహిస్తూ, బాహ్యంగా వ్యక్త పరుస్తున్న సత్యాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. పరమహంసగారు ఉంటున్న ఆశ్రమంలో బయట పనిచేస్తున్న సన్యాసులలో ఒకరు ఇలా గుర్తు చేసుకున్నారు: “కొద్ది సేపటికోసం ఆయన పెరట్లోకి వచ్చారు, ఆయన కళ్ళు గణింపశక్యం కాని సుదూరాలను చూస్తున్నాయి. ఇంకా ఆయన నాతో ఇలా అన్నారు: ‘మూడు లోకాలు నాలో బుడగలవలే తేలుతున్నాయి.’ ఆయన నుండి వెలువడుతున్న శక్తి, నన్ను ఆయన నుంచి చాలా అడుగుల దూరం వెనక్కి నెట్టేసింది.”

గురూజీ పనిచేస్తున్న గదిలోకి ప్రవేశించిన మరో సన్యాసి ఇలా గుర్తు చేసుకున్నారు: “ఆ గదిలోని స్పందనలు నమ్మశక్యం కానివి; దైవంలోకి నడుస్తున్నట్టుగా అనిపించింది.”

అప్పట్లో పరమహంసగారు ఒక శిష్యునికి ఇలా వ్రాశారు, “నేను స్వర్గములో తెరచి ఉంచి, ఈ ప్రపంచములో మూసిన కళ్ళతో, ఆధ్యాత్మిక గ్రంథాల అర్థాలని మరియు, ఉత్తరాలని రోజంతా చెబుతూ ఉన్నాను.”

పరమహంసగారి గీతా వ్యాఖ్యానం రచన చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమై (మొదటి కొన్ని సంచికలు 1932 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ పత్రికలో మొదలయ్యాయి) ఎడారిలో ఉన్న ఈ సమయంలోనే పూర్తి అయ్యింది, ఇందులో చాలా సంవత్సరాల క్రితం రచించబడిన రచనల సమీక్ష కూడా ఉంది, మరియు చాలా విషయాలపై స్పష్టత మరియు వాటియొక్క విపులీకరణం, కొత్త పాఠకుల కోసం వ్రాయబడిన సంచికలలో ఒకే మాదిరిగా ఉన్న వ్యాసముల యొక్క సంక్షిప్తీకరణ, అదనంగా కొత్త స్ఫూర్తిదాయక విషయాలను కలిపి – గత సంవత్సరాలలో సాధారణ పాఠకులకు తెలుపడానికి ప్రయత్నించని – గీత యొక్క విశ్వోద్భవ శాస్త్రం మరియు మనిషి యొక్క శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్వభావం యొక్క దృక్పథం లాంటి నిగూఢమైన యోగశాస్త్ర తాత్విక భావనలు అన్నీ పాశ్చాత్య మనసుకు మరింత అర్థమయ్యేలా అక్షరాలా పుస్తక రూపంలో ప్రచురణకు సిద్ధం చేశారు.

సంపాదకీయ పనిలో ఆయనకు సహాయపడటానికి గురుదేవులు తారామాత (లౌరీ వి.ప్రాట్) పై ఆధారపడ్డారు. 1924లో గురువుగారిని కలుసుకున్న ఆమె, వివిధ సమయాల్లో ఆయన పుస్తకాలు మరియు ఇతర రచనలపై ఇరవై ఐదుకి పైగా సంవత్సరాల పాటు పనిచేసి ఉన్నత అధ్యాత్మికాభివృద్ధి చెందిన ఉత్కృష్ట శిష్యురాలు. విశ్వాసపాత్రురాలైన ఈ శిష్యురాలు పోషించిన పాత్రకు తగిన గుర్తింపు మరియు ప్రశంసలు ఇవ్వకుండా పరమహంసగారు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి అనుమతించరని నాకు నిస్సందేహంగా తెలుసు. “ఆమె ఒక గొప్ప యోగిని, ఎన్నో జన్మల పాటు భారతదేశంలో బాహ్య ప్రపంచానికి దూరంగా గడిపారు. ఈ కార్యనిమిత్తం సేవ చేయటానికై ఈ జన్మ స్వీకరించారు” అని ఆయన నాకు చెప్పారు. అనేక బహిరంగ సందర్భాలలో ఆయన ఆమె యొక్క సాహితీ చతురత మరియు తాత్విక జ్ఞానం గురించి ఇలా వ్యాఖానించారు: “ఆమె దేశంలోనే ఉత్తమ సంపాదకురాలు; బహుశా మరెక్కడైనా కూడా. భారతీయ తత్వశాస్త్రాన్ని గురించిన చర్చలు – గొప్ప వారైన‌ నా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్ గారితో తప్ప, లౌరీతో కన్నా ఎక్కువగా ఇంకెవరితోనూ అంతగా ఆస్వాదించలేదు.”

ఆయన జీవితంలో తరువాతి సంవత్సరాలలో, పరమహంసగారు తన రచనలను కూర్చడానికి మృణాళినీమాత అనే మరొక సన్యాస శిష్యురాలికి శిక్షణను ఇవ్వనారంభించారు, గురుదేవులు మా అందరికీ ఆమెను ఏ పాత్రకు సిద్ధం చేస్తునారో స్పష్టం చేశారు. ఆయన బోధనల యొక్క ప్రతి అంశంలోనూ, ఆయన రచనలు మరియు ప్రసంగాలను సిద్ధం చేయటంలోనూ మరియు వాటిని ప్రదర్శించటంలోనూ ఆమెకు వ్యక్తిగత శిక్షణను ఇచ్చారు.

ఒక రోజు తన జీవితపు చరమ దశలో, ఆయన ఇలా అన్నారు: “నేను లౌరీ గురించి చాలా ఆందోళన పడుతున్నాను. నా సాహిత్య పనిని పూర్తి చేయడానికి ఆమె ఆరోగ్యం సహకరించదు.”

తారామాతపై గురువుగారు ఎంతగా ఆధారపడతారో తెలిసిన మృణాళినీమాత ఆందోళన వ్యక్తం చేస్తూ: “అయితే గురుదేవా, ఆ పని ఎవరు చేయగలరు?”

గురుదేవులు నిశ్చయతతో సమాధానమిచ్చారు: “నీవు దీన్ని పూర్తి చేస్తావు.”

1952లో పరమహంసగారు మహాసమాధి చెందిన తరువాత సంవత్సరాలలో, తారామాత భగవద్గీత శ్లోకాలపై పరమహంసగారి వ్యాఖ్యానాలను పత్రికలో సంచికలుగా ప్రచురించడాన్ని నిరంతరాయంగా కొనసాగించగలిగారు (సభ్యురాలిగా, బోర్డు డైరెక్టరుగా మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ముఖ్య సంపాదకురాలిగా అనేక విధులతో ఆమె తీరిక లేకుండా ఉన్నప్పటికీ). అయినప్పటికీ, పరమహంసగారు ఊహించినట్టుగానే, గీత వ్రాతప్రతిని పూర్తి చేయడానికి ముందే ఆమె కన్నుమూశారు. ఈ పని మృణాళినీమాత భుజాలపై పడింది. గురువుగారు ముందుగానే సూచించినట్టుగా ఆమె మాత్రమే తారామాత మరణించిన తరువాత ఈ కార్యాన్ని సరిగ్గా నెరవేర్చగలిగిన ఏకైక వ్యక్తి, సంవత్సరాలపాటు ఆమెకు గురువుగారు ఇచ్చిన శిక్షణ మరియు గురువుగారి ఆలోచనలతో ఆమె సాధించిన అనుసంధానమే కారణం….

పరమహంస యోగనందగారు ఈ భూమిపై ద్వంద్వ పాత్రలు పోషించారు. ఆయన పేరు మరియు నెరవేర్చిన కార్యక్రమాలు ఆయన స్థాపించిన సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ప్రపంచవ్యాప్త సంస్థతో అసమానమైన గుర్తింపు పొందుతోంది. ఎస్.ఆర్.ఎఫ్./వై.ఎస్.ఎస్. క్రియాయోగ బోధనలను స్వీకరించే వేలాది మందికి ఆయన వ్యక్తిగత గురువు. ఆయన జీవితం మరియు సార్వత్రిక సందేశం అనేక మంది వివిధ మార్గాలు మరియు మతాల అనుచరులకు ప్రేరణ మరియు వారి ఉన్నతికి మూలం – ఆయన ఆధ్యాత్మిక వారసత్వం మొత్తం ప్రపంచానికి అందించబడిన ఆశీర్వాదం. సంస్కృతంలో సంబోధించేటట్లుగా ఆయన ఒక జగద్గురువు, ఒక ప్రపంచ బోధకుడు.

భూమిపై ఆయన చివరి రోజు అయిన మార్చి 7,1952ని నేను గుర్తుచేసుకుంటాను, ఆరోజు ఆయన చాలా మౌనంగా ఉన్నారు, ఆయన చైతన్యం మామూలు కన్నా కూడా ఎక్కువ లోతుగా అంతర్లీనమై ఉంది. ఆయన దృష్టి ఈ పరిమిత విశ్వంపై కాక లోకాతీతమైన దైవ సాన్నిధ్యంలో ఉండటం శిష్యులమైన మేము ఆరోజు చాలా సార్లు గమనించాము. అరుదుగా మాట్లాడిన ఆయన మాటలలో గాఢమైన ఆప్యాయత, ప్రశంస మరియు దయ ఉన్నాయి. కానీ నా జ్ఞాపకంలో చాలా స్పష్టంగా ఉండిపోయింది ఏమిటంటే, ఆయన గదిలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ ఆయన నుండి వెలువడిన గాఢమైన ప్రశాంతత మరియు అపారమైన దివ్య-ప్రేమ యొక్క స్పందనలు గమనించారు. సాక్షాత్తు జగన్మాత యొక్క సర్వ-మోక్షప్రదమైన అనంత-ఆత్మతత్వం, ఆమె దయ కారుణ్యపూరిత సంరక్షణ, మరియు షరతులు లేని ఆమె ప్రేమ – మూర్తీభవించి ఆయనను పూర్తిగా ఆవహించి, ఆయన ద్వారా మొత్తం సృష్టి అంతటికీ ఆమె తన ప్రేమ కెరటాలను పంపిస్తూ హత్తుకుంటున్నట్లుగా అనిపించింది.

ఆ సాయంత్రం భారత రాయబారి గౌరవార్థం పరమహంసగారు ప్రధాన వక్తగా ఏర్పాటు చేసిన పెద్ద స్వాగత సమారోహంలో ఆ గొప్ప గురువు తన శరీరాన్ని విడిచిపెట్టి సర్వవ్యాపకత్వాన్ని చేరారు.

మానవజాతికి దైవదూతలుగా వచ్చిన గొప్ప మహాత్ములందరి వలెనే, పరమహంసగారి ప్రభావం ఆయన తరువాత కూడా నిలిచి ఉంది. ఆయన అనుచరులు ఆయనని ప్రేమావతారులుగా, అంటే దేవుని దివ్యప్రేమ యొక్క అవతారమూర్తిగా ఆరాధిస్తారు. తమ సృష్టికర్తను మరచిన హృదయాలను నిద్ర నుండి మేలుకొలిపి, అప్పటికే అన్వేషిస్తున్న వారికి జ్ఞానోదయ మార్గాన్ని ఇవ్వడానికి దైవ ప్రేమతో ఆయన వచ్చారు. ప్రతీ మానవ ఆత్మ యొక్క అత్యున్నత లక్ష్యమైన దైవాన్వేషణను మనకు గుర్తుచేస్తూ, ఈ మార్గం అంతటా ఉండే సంరక్షణ యొక్క వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తుండే దివ్య ప్రేమ యొక్క సరిక్రొత్త ఆకర్షణను, పరమహంసగారి ఈ గీత వ్రాతప్రతిని సమీక్షించడంలో నేను అనుభవించాను.

పరమహంస యోగానందగారి సంపూర్ణమైన విశ్వప్రార్థన నా ఆత్మలో ప్రతిధ్వనిస్తుండగా పదే పదే వింటున్నాను – ఆయన నిర్వహించిన ప్రపంచ-కార్యానికి మరియు భగవద్గీత అనే ఆయన యొక్క జ్ఞానోదయ ఆవిష్కరణను మనకు అందించడానికి ఆయనకున్న ప్రేరణను వర్ణించగలిగేది ఇదే:

పరమేశ్వరా, జగన్మాతా, సఖా, ప్రియదైవమా,
నా భక్తి అనే గర్భగుడిలో నీ ప్రేమ సదా ప్రకాశించుగాక,
అందరి హృదయాలలో నేను నీ ప్రేమను మేల్కొలప గలిగెదను గాక.

“ఒక క్రొత్త గ్రంథం ఆవిర్భవించింది”

పరమహంస యోగానందగారు రచించిన
గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) పై
శ్రీ శ్రీ దయామాత యొక్క తుదిపలుకులు

ఎడారి ఆశ్రమంలో భగవద్గీతపై చాలా నెలల పరిశ్రమ అనంతరం, ఒకరోజు పరమహంస యోగానందగారు కాలిఫోర్నియా, ఎన్సినీటస్ లోని సాగరతీర ఆశ్రమంలో బసచేసి ఉన్నారు. అది దాదాపు తెల్లవారు ఝామున మూడు గంటల సమయం; రాత్రి చాలా గంటలపాటు, ఆయన తన గీత అనువాదం మరియు వ్యాఖ్యానంపై గాఢంగా దృష్టిపెట్టి ఉన్నారు. ఆఖరికి తనకు దగ్గరలో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న శిష్యుని వైపు తిరిగి ఆయన, “నేను నెరవేర్చడానికి వచ్చిన పనిని పూర్తి చేస్తున్నప్పుడు సాక్షిగా ఉన్నందుకు నీవు ఈ రాత్రి గొప్పగా ఆశీర్వదించబడ్డావు. నేను గీతను పూర్తి చేశాను. ఈ పని నాకు ఇవ్వబడింది, నేను ఈ గీత వ్రాస్తానని వాగ్దానం చేశాను – అది పూర్తి అయ్యింది. గొప్ప గురువులు (ఎస్.ఆర్.ఎఫ్. గురువులు) అందరూ ఈ రాత్రి ఈ గదిలో ఉన్నారు, నేను నా ఆత్మలో వారితో సంభాషించాను. నా జీవితకాలం ఇప్పుడు నిమిషాలో, గంటలో, రోజులో – బహుశా సంవత్సరాలో నాకు తెలియదు; అది జగన్మాత చేతిలో ఉంది. నేను కేవలం ఆమె దయవల్ల మాత్రమే జీవిస్తున్నాను.”

ఆ తరువాత పరమహంసగారు ఆ రోజు తనను పరివేష్టించి ఉన్న ప్రత్యేక ఆశీర్వాదాలను ఇతర సీనియర్ శిష్యులతో కూడా పంచుకోవాలని కోరుకుంటూ వారిని పిలిపించారు.

పరమహంసగారికి కలిగిన దివ్య అనుభవానికి తరువాయి భాగం ఆ తరువాత ఆయన పడకగదిలో ఒంటరిగా ఉన్నప్పుడు కలిగింది. ఆయన ఇలా చెప్పారు “గది మూలలో ఒక కాంతి ఉంది, పరదా సందు నుంచి వస్తున్న ఉదయ కిరణాలు అయ్యి ఉంటాయని నేను అనుకున్నాను; నేను చూస్తుండగా, ఆ కాంతి ప్రకాశవంతంగా పెరిగి విస్తరించింది.” వినయంగా దాదాపు వినబడకుండా, ఇంకా ఆయన ఇలా అన్నారు: “ఆ ప్రకాశం నుండి శ్రీయుక్తేశ్వర్ గారు ఆమోదపూరిత నేత్రాలతో దర్శనం ఇచ్చారు.” …

చాలా సంవత్సరాల క్రితం, శ్రీయుక్తేశ్వర్ గారు పరమహంసగారితో ఇలా అన్నారు: “నీవు భగవద్గీత యొక్క సత్యాన్నంతటినీ నువ్వు గ్రహిస్తావు. ఎందుకంటే కృష్ణార్జున సంవాదం వ్యాసునకు వెల్లడయిన విధంగా నువ్వు విన్నావు. వెళ్ళి, వెల్లడయిన ఆ సత్యాన్ని నీ వివరణలతో సహా ఇవ్వు: క్రొత్త గ్రంథం ఆవిర్భవిస్తుంది.”

ఈ గ్రంథ రచనపై చాలా నెలలు మరియు సంవత్సరాల పరిశ్రమ అనంతరం, పరమహంసగారు ఇప్పుడు తన గురువు భవిష్యవాణి ఫలించడాన్ని చూశారు. శిష్యులకు గీతపై తన వ్యాఖ్యానం ముగిసిందని, ఆనందకరమైన చిరునవ్వుతో ఆయన వినయంగా తనకు శ్రీయుక్తేశ్వర్ గారు చెప్పినదాన్ని ఇలా పునరుద్ఘాటించారు: “ఒక క్రొత్త గ్రంథం ఆవిర్భవించింది.”

“ఈ గీతను నాకు ఇవ్వబడినట్లుగా నేను వ్రాశాను,” ఆయన అన్నారు, “నేను మహాత్ములైన నా గురువులతో, గీత మూల-కర్తలతో ఐక్య అనుసంధానంతో పారవశ్యంలో ఉన్నందున నా ద్వారా వచ్చిన గీత వారికి చెందుతుంది. మా గురువుగారు చెప్పినది నాకు తెలిసిన ప్రకారం: ‘ఇప్పటివరకు వివిధ వివరణల యొక్క అనేక రూపాలలో శతాబ్దాలుగా పాక్షికంగా మాత్రమే వివరించబడిన గీతను , ప్రపంచంలోని నిజమైన భక్తులందరినీ తన పూర్తి తేజస్సుతో ముంచెత్తడానికి ఒక కొత్త గీతగా బయటకు వస్తోంది.’”

God Talks With Arjuna: The Bhagavad Gita, శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఆర్డర్ చేయండి

ఇతరులతో పంచుకోండి