తరచుగా అడిగే ప్రశ్నలు

యోగా అంటే ఏమిటి?

యోగా అనే పదానికి అర్థం ఆత్మ – వ్యక్తి చైతన్యం, మరియు పరమాత్మ – విశ్వ చైతన్యం యొక్క ‘కలయిక’. ఈ కాలంలో యోగాభ్యాసం వేరు వేరు మార్గాల్లో అనుసరించబడుతున్నా, అది యోగాసనాలుగా ప్రచారంలో ఉంది. గాఢమైన యోగాభ్యాసం మాత్రం ఆత్మను అనంతమైన పరమాత్మతో అనుసంధానం చేయడానికి నిర్దేశించబడింది.

మీరు నేర్పే యోగా పేరేమిటి?

పరమహంస యోగానందగారు రాజ యోగ మార్గాన్ని బోధించారు, అందులో శాస్త్రీయమైన ధ్యాన పద్ధతులు — క్రియాయోగం — ఈ యోగ దీక్షతో సాధకుడు మొదటి నుంచి ఆత్మ పరమాత్మల కలయిక అనే అంతిమ లక్ష్య సాధన యొక్క పరిపూర్ణతా అనుభూతులను తెలుసుకుంటూ ముందుకు సాగుతాడని చెప్పడం జరిగింది. క్రియాయోగ మార్గం అంటే మనిషి జీవన విధానానికి కావలసిన తత్వశాస్త్రాన్ని కూడా బోధిస్తుంది. క్రియాయోగం అభ్యసించడం మనిషి తన మానసిక మరియు శారీరక విధానాలను శాంత పరిచి, అతని చైతన్యాన్ని బంధనాల నుంచి విముక్తి చేసి, భగవంతుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని, సచ్చిదానంద స్థితిని గ్రహించగలిగేలా చేస్తుంది.

వై.ఎస్.ఎస్. బోధనల్లో హఠ యోగాసనాలు కూడా ఉంటాయా?

వై.ఎస్.ఎస్. బోధనలు హఠ యోగాసనాల గురించి గాని వాటిని ఎలా సాధన చేయాలనే విషయాలు గాని తెలియజేయవు. కానీ పరమహంస యోగానందగారు వాటిని నేర్చుకొని సాధన చేయడం చాలా ఉపయోగకరమని చెప్పారు.

క్రియాయోగం గురించి నాకు పూర్తి వివరాలు ఎలా తెలుస్తాయి మరియు పరమహంస యోగానందగారి బోధనలు నేనెలా చదవగలను?

మా ద్వారా ప్రచురింపబడిన ఉచిత పుస్తకం, ఆత్మసాక్షాత్కారం ద్వారా అత్యున్నత విజయాలు చదవండి. ఇంకా పరమహంస యోగానందగారిచే వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథం ఒక యోగి ఆత్మకథ కూడా చదవండి. శ్రీ యోగానందగారి బోధనల గురించి ఆసక్తి ఉంటే యోగదా సత్సంగ పాఠాల కోసం దరఖాస్తు చేసుకోండి.

యోగదా సత్సంగ పాఠాల్లోని విషయాలేమిటి?

యోగదా సత్సంగ పాఠాలు పరమహంస యోగానందగారిచే బోధించబడిన యోగ పద్ధతులు, క్రియాయోగం నేర్చుకోవడానికి వీలుగా, అంచెలంచెలుగా చదువుకుంటూ సాధన చేయడానికి ఉపయోగపడేవిగా, ఇంట్లో నుంచే అర్థం చేసుకుంటూ అనుసరించే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. ఆయన ద్వారా బోధించబడిన “జీవించడం ఎలా” అన్న శీర్షికలో తెలియజేయబడ్డ ఎన్నో విషయాలు కూడా ఈ పాఠాల్లో చేర్చబడ్డాయి.

నా ప్రాపంచిక బాధ్యతలు నాకు వేరే పనులకు సమయం లేకుండా చేస్తున్నాయి. నా ఆధ్యాత్మిక లక్ష్యాలను నేనెలా చేరగలను?

ఎన్నో విధాల బాధ్యతలతో, ఎన్నో పనులతో సమయం లేకుండా సతమతమవుతున్న వాళ్ళ ఇబ్బందులను పరమహంస యోగానందగారు బాగా అర్థం చేసుకున్నారు. ఆయన ధ్యానము మరియు సరైన కార్యాచరణ, రెండింటి యొక్క కలయికతో కూడిన సమతుల్యమైన మార్గాన్ని బోధించారు. ఆయన బోధనలు చాలా అద్భుత రీతిలో ఆచరణాత్మకమైనవని మీరు గ్రహిస్తారు మీ యొక్క రోజువారీ కుటుంబ మరియు కార్యాలయ బాధ్యతల నిర్వహణలో అవి మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన బోధనలు మీకు నేర్పేదేమిటంటే మీ ప్రతి కార్యాచరణలో భగవంతున్ని తీసుకొనిరావడం మరియు ఆయన సాన్నిహిత్యంతో కలిగే ఆనందం అనుభవించడం, ఆయన బోధనల్లో మీకు లభిస్తాయి. యోగదా సత్సంగ సొసైటీ వారి ఆధ్యాత్మిక పద్ధతుల సాధన కొరకు ప్రతి రోజూ కొంత సమయం కేటాయించడం ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది. సాధనకు ఎంత ఎక్కువ సమయం వెచ్చించాము అనే దాని కంటే, సాధనలో చిత్తశుద్ధి మరియు గాఢత వలన భగవంతునితో మనం ఆంతరంగిక అనుబంధం ఏర్పరచుకోగలము.

నా ఆధ్యాత్మిక సాధనలో నేను ముందుకు వెళుతున్నానో లేదో నాకెలా తెలుస్తుంది?

ఆధ్యాత్మిక అభివృద్ధి ఒక క్రమ విధానం. మనలో జరిగే సానుకూల మార్పులే మన ఆధ్యాత్మిక పురోగతికి నిశ్చయమైన సంకేతాలు – అంటే, అంతా బాగుందనే భావన పెరుగుతున్నప్పుడు; భద్రత, ప్రశాంతత, ఆనందం, సమగ్ర అవగాహన, చెడు అలవాట్ల నుంచి విముక్తి, దాంతో పాటు భగవంతుని పై అధిక ప్రేమ, తెలుసుకోవాలనే అభిలాష పెరగటం; ఆధ్యాత్మికంగా విజయం సాధించాలంటే మంచి పట్టుదల ఉండాలని పరమహంస యోగానందగారు చెప్పారు. ఒక్కోసారి సాధనలో గొప్ప అభివృద్ధి సాధిస్తున్న వాళ్ళకు కూడా ఆ అబివృద్ధికి సాక్షిగా గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు ఉండవచ్చు, ఉండక పోవచ్చు. నిజం చెప్పాలంటే మనం వదలకుండా ఆధ్యాత్మిక సాధన చేయగలిగినప్పుడు, జీవితంలో ఎదురయ్యే రోజువారీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనగలిగినప్పుడు, మనం ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించినట్లన్నమాట, భగవంతుని దగ్గర్నుంచి మనకు అర్థమయ్యే విధమైన సమాధానం రాకపోయినా కూడా. నిజమైన ఆధ్యాత్మిక అభివృద్ధి దర్శనాలు లేదా ఇతర అనుభవాల కంటే మన రోజువారీ ప్రవర్తన, ఆలోచనలు మరియు చర్యలలో ఎక్కువగా ప్రతిబింబిస్తుంది.

వై.ఎస్.ఎస్. బోధనలను అనుసరిస్తూ ఇతర ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఇతర సాధనలు పాటించటము నేను చేయవచ్చా?

పరమహంస యోగానందగారు అన్నీ మతాల వారిని తన బోధనలు స్వీకరించడానికి ఆహ్వానించారు. దాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు, ఆయన నేర్పే యోగ మార్గాలను అనుసరించే వాళ్ళకు కలిగే ఫలితాలు ఒక మత సిద్ధాంతాన్ని అంగీకరించడం ద్వారా లభించేవి కావని, సాధనతో భగవంతుని స్వయంగా తెలుసుకోవడం వలన మాత్రమే అని. అయితే వివిధ మార్గాల్లో చెప్పబడిన ఆధ్యాత్మిక పద్ధతులను కలిపి సాధన చేయడం వలన కలిగే ఫలితం తక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. మీ ఆధ్యాత్మిక లక్ష్యం త్వరగా చేరుకోవాలంటే, ఒక్క మార్గాన్ని ఎన్నుకొని దాన్ని వదలకుండా అనుసరించి ఆ పద్ధతిలో సాధన చేయడం మంచిదని చెప్పారు.

ధ్యాన తరగతులను మీరు నిర్వహిస్తారా?

మీరు ధ్యానం చేయడం నేర్చుకోవాలనుకుంటే యోగదా సత్సంగ పాఠాలు చదవడానికి సభ్యులుగా చేరడాన్ని మేము సిఫార్సు చేస్తాము. పరమహంస యోగానందగారి జీవితకాలంలో ఆయన ద్వారా చెప్పబడిన విషయాలే మేము ప్రచురించిన, ఇంట్లోనే చదువుకోవడానికి తయారు చేయబడిన ఈ పాఠాల్లో పొందుపరచడం జరిగింది. క్రియాయోగ ప్రక్రియ గురించి, “జీవించడం ఎలా” అని వివరించిన గురువుగారి ప్రవచనాల సారాంశాన్ని గురించి, ఈ వై.ఎస్.ఎస్. పాఠాలు మీకు తెలియజేస్తాయి.

నేను క్రియాయోగ దీక్ష ఎప్పుడు తీసుకోగలను?

యోగదా సత్సంగ పాఠాల ప్రాథమిక శ్రేణిలోని విద్యార్థులు తమ వ్యక్తిగత నివేదికను (పాఠం 17తో జతపరచబడినది) రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠానికి సమర్పించడం ద్వారా క్రియాయోగమును స్వీకరించడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. (మునుపటి పాఠాల సంచికలో స్టెప్ I మరియు స్టెప్ II దశలను పూర్తి చేసిన విద్యార్థులు—ఆ శ్రేణిలోని పాఠం సంఖ్య 52 ద్వారా—కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.)

ఆధ్యాత్మిక సాధనలో అభివృద్ధికి గురువు యొక్క ప్రత్యక్ష శిక్షణ అవసరమా?

పరమహంస యోగానందగారు ఇలా వివరించారు: “శరీరంలో ఉన్నా లేకపోయినా నిజమైన గురువులు ఎల్లప్పుడు సజీవంగా ఉంటారు. వారి చైతన్యం తమ శిష్యుల చైతన్యంతో అనుసంధానములో ఉంటుంది, వాళ్ళు ఒకే చోట జీవిస్తూ ఉన్నా లేకపోయినా. సర్వవ్యాపకత్వం అనేది సద్గురువుల లక్షణాల్లో, అభివ్యక్తీకరణలో ముఖ్యమైనది.” ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం తనను ఆశ్రయించేవారికి సహాయం చేయడం, ఆశీర్వదించడం పరమహంస యోగానందగారు ఇప్పుడు కూడా చేస్తున్నారు.

వై.ఎస్.ఎస్. గురు పరంపరలో పరమహంస యోగానందగారి తర్వాత ఎవరైనా గురువుగా నియమించబడ్డారా?

మహాసమాధిలోకి వెళ్ళడానికి ముందే పరమహంసగారు ఇలా అన్నారు, భగవదేచ్ఛ ప్రకారం యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ గురు పరంపరలో తానే చివరి గురువునని. “నా తర్వాత నా బోధనలే గురువుగా ఉంటాయి. వాటి ద్వారానే మీరు నాతో మరియు నన్ను పంపిన గొప్ప గురువులతో అనుసంధానంలో ఉంటారు.” కాబట్టి తర్వాత వచ్చిన శిష్యులెవరూ గురువుగా బాధ్యతలు స్వీకరించడం చేయరు అని పరమహంస యోగానందగారు స్పష్టం చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఈ విధమైన దివ్య శాసనం చేయడం కొత్త కాదు. భారతదేశంలో సిక్కు మతాన్ని స్థాపించిన గొప్ప సాధువు గురునానక్ మరణించిన తరువాత, గురువుల సాధారణ వారసత్వం కొనసాగింది. ఆ వరుసలోని పదవ గురువు తాను ఆ గురువుల వరుసలో చివరి గురువునని, మరియు ఇక నుండి తన బోధనలనే గురువుగా పరిగణించాలి అని ప్రకటించారు. పరమహంస యోగానందగారు తనచే స్థాపించబడిన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా పని చేస్తానని హామీ ఇచ్చారు.

వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలకు ప్రస్తుత అధిపతి ఎవరు?

ప్రస్తుతం వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. సంస్థలకు అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక నాయకుడు శ్రీ శ్రీ స్వామి చిదానందగారు. ఆయన యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ సంస్థలో నలభై సంవత్సరాలు సన్యాసిగా ఉన్నారు. 2010లో తన శరీరం చాలించే ముందు అప్పటి అధ్యక్షురాలుగా వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్.లో ఉన్న శ్రీ దయామాతగారు తనకు స్వామి చిదానందగారి పై ఉన్న దృఢ విశ్వాసాన్ని మృణాళినీమాతకు వ్యక్తపరిచారు. శ్రీ మృణాళినీమాత దేహం చాలించడానికి ముందు ఈ విషయాన్ని ధ్రువపరుస్తూ, వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. తాను కూడా శ్రీ దయామాతతో ఏకీభవిస్తున్నానని ఈ సంస్థల యొక్క డైరెక్టర్ల బోర్డు వారికి చెప్పారు. స్వామి చిదానందగారు ఆగస్టు 30, 2017న అధ్యక్షులుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చేత ఎన్నుకోబడ్డారు.

వై.ఎస్.ఎస్/ఎస్.ఆర్.ఎఫ్ చిహ్నమైన కమలం పువ్వుకు అర్థం ఏమిటి ?

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క గుర్తింపు చిహ్నం, రెండు కనుబొమల మధ్య బంగారు తామరపువ్వులో చుట్టూ నీలము మరియు బంగారు కాంతి వలయాలతో ఉన్న తెల్లని నక్షత్రం, ఆధ్యాత్మిక నేత్రాన్ని వర్ణిస్తుంది. వికసించిన కమలం జాగృతమైన ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రాచీనమైన చిహ్నంగా ఉన్నట్లే, దైవికమైన అవగాహన కోసం ధ్యానించే భక్తుడు ఆధ్యాత్మిక నేత్రాన్ని తెరవాలనే లక్ష్యాన్ని ఇది సూచిస్తుంది.

ఇతరులతో పంచుకోండి