సన్నిహిత శిష్యుల కథలు

1996లో ఒక యోగి ఆత్మకథ పుస్తకం 50వ వార్షికోత్సవం సందర్భంగా, మాతో అప్పటికీ ఉన్న పరమహంస యోగానందగారి అనేకమంది సన్నిహిత శిష్యులు, పుస్తకాలు వచ్చిన నాటి వారి గత స్మృతులను మరియు వారి జీవితాలపై దాని ప్రభావాన్ని మాతో పంచుకున్నారు. దాని పేజీల నుండి వెలువడే దివ్యజ్ఞానం, ప్రేమ మరియు జీవితమును పరివర్తన చేకూర్చే దృష్టిని మొట్టమొదట అనుభవించిన వారిలో వీరు ఉన్నారు — అప్పటి నుండి లక్షలాది జీవితాలను ఈ పేజీలు మార్చివేశాయి..

Mother of compassion — Daya Mata.
శ్రీ శ్రీ దయామాత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క మూడవ అధ్యక్షురాలు, 1955 - 2010

గురుదేవులు మాతో ఇలా అన్నారు: “నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళినప్పుడు, ఈ పుస్తకం లక్షలాది ప్రజల జీవితాలను మారుస్తుంది. నేను వెళ్ళిపోయిన తరువాత ఇది నా సందేశవాహకంగా ఉంటుంది.”

ఒక యోగి ఆత్మకథను వ్రాయడం అనే అతిపెద్ద కార్యాన్ని పూర్తి చేయడానికి పరమహంసగారికి చాలా సంవత్సరాలు పట్టింది. నేను 1931లో వాషింగ్టన్ వచ్చినప్పటికే పరమహంసగారు దాని పై పని చేయడం ప్రారంభించి ఉన్నారు. ఒకసారి నేను ఆయన పఠన మందిరములో కొన్ని కార్యదర్శి విధులను నిర్వహిస్తున్నప్పుడు, ఆయన వ్రాసిన మొదటి అధ్యాయాలలో ఒకదాన్ని చూడగలిగే అదృష్టం నాకు కలిగింది — అది “టైగర్ స్వామి” గురించి వ్రాసిన అధ్యాయం. అది ఒక పుస్తకంలోకి చెర్చబడేది కావున దానిని భద్రపరచమని గురుదేవులు కోరారు.

అయినప్పటికీ పుస్తకంలోని ఎక్కువ భాగం 1937 మరియు 1945 మధ్య రచించబడింది. పరమహంసగారికి చాలా బాధ్యతలు మరియు ఒప్పందాలు ఉండేవి, ఆయన ప్రతిరోజూ తన పుస్తకంపై పని చేయలేకపోయేవారు, కానీ సాధారణంగా, ఆయన సాయంకాలమును దాని కొరకే వినియోగించేవారు, అలాగే ఏ ఇతర ఖాళీ సమయము దొరికినా ఆయన తన మనస్సును దానిపైనే ఉంచేవారు.

మా ఈ చిన్న బృందం — ఆనందమాత (క్రింద), శ్రద్ధామాత మరియు నేను — వ్రాత ప్రతి టైప్ చేయడానికి సహాయపడుతూ, ఆ సమయంలో చాలావరకు ఆయన దగ్గర ఉండేవాళ్ళం. ప్రతి భాగాన్ని టైప్ చేసిన తరువాత దాన్ని గురుదేవులు, సంపాదకురాలిగా పని చేసిన తారామాతకు ఇచ్చేవారు.

ఒక రోజు, తన ఆత్మకథపై పనిచేస్తూ, గురుదేవులు మాతో ఇలా అన్నారు: “నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళినప్పుడు, ఈ పుస్తకం లక్షలాది జనుల జీవితాలను మారుస్తుంది. నేను వెళ్ళిపోయిన తరువాత అది నా సందేశవాహకంగా ఉంటుంది.”

వ్రాత ప్రతి పూర్తి అయిన తరువాత, తారామాత దాని కోసం ఒక ప్రచురణకర్తను వెదకడానికి న్యూయార్క్ వెళ్ళారు. ఆమె జ్ఞానం మరియు సంపాదకీయ సామర్థ్యాల పట్ల పరమహంసగారికి ఎంతో గౌరవం ఉండేది మరియు తరచుగా ఆమెను బహిరంగంగా ప్రశంసించేవారు. ఆయన ఇలా అన్నారు: “ఈ పుస్తకం కోసం ఆమె పడిన శ్రమను నేను వర్ణించలేను. న్యూయార్క్ వెళ్ళే ముందు ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. అదే పరిస్థితిలో ఆమె న్యూయార్క్ కు బయలుదేరింది. కాని ఆమె సహాయం లేని పక్షంలో, పుస్తకం ఎప్పటికీ కొనసాగేది కాదు.”

పుస్తకం పూర్తయినందున గురుదేవులు వ్యక్తపరచిన ఆనందకరమైన ప్రతిస్పందనను మాటల్లో వ్యక్తపరచలేము. ఇక్కడి ఆశ్రమాలలో ఉన్న అనేక ఇతర భక్తుల కొరకు చేసినట్లు ఆయన నా కాపీకి కూడా హస్తాక్షరించారు. వ్రాత ప్రతి టైప్ చేయడానికి సహాయం చేసినందున, నేను దానిని స్వీకరించినప్పుడే నాకు తెలుసు ఇది ఒక అమర పుస్తకం అని — ఇంతకుముందు ఎప్పుడూ ఇంత స్పష్టమైన మరియు స్ఫూర్తిదాయకమైన విధంగా తెలియజెప్పబడని మరుగునపడి ఉన్న సత్యాలను మొదటిసారిగా వెల్లడించింది. అద్భుతాలు, పునర్జన్మ, కర్మ, మరణానంతర జీవితం మరియు దాని పేజీలలో నిక్షిప్తమైయున్న ఇతర అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాల గురించి గురుదేవులు చెప్పిన వివరణలను మరే రచయిత కూడా సమీపించలేరు.

ఈ రోజు ఈ పుస్తకం ఖ్యాతిపై ఆయన స్పందన ఎలా ఉంటుంది? ఒక యోగి ఆత్మకథ భూమి నలు మూలల్లోని ప్రతి సంస్కృతి, జాతి, మతం మరియు వయస్సులో గల ప్రజలందరికీ చేరిందని మరియు ఈ యాభై ఏళ్ళలో ఇది అద్భుతమైన ప్రశంసలు మరియు ఎంతో ఉత్సాహంతో స్వీకరించబడిందనీ తెలిసి ఆయన వినయంతో చలించిపోయేవారు. గరుదేవులు తన సొంత ప్రాముఖ్యత గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయినప్పటికీ ఆయన వ్రాసిన దాని యొక్క ప్రాముఖ్యతను నిశ్చయంగా విశ్వసించారు — ఎందుకంటే ఆయన యథార్థాన్ని వ్రాస్తున్నారని ఆయనకి తెలుసు.

తారామాత (లౌరీ ప్రాట్) కోసం పుస్తకంపై లిఖించబడింది. ఒక యోగి ఆత్మకథ లోని రచయిత యొక్క కృతజ్ఞతలో కనిపించే నివాళిలో, పరమహంసగారు తన వ్రాతప్రతికి సంపాదకత్వం వహించిన తారామాత పాత్రకు ప్రశంశలను తెలియజేసారు. ఆమె పుస్తకం కాపీలోని ఈ లిఖితము ఈ విలువైన శిష్యురాలి సేవ పట్ల ఆయనకు ఉన్న అగాధమైన గౌరవం గురించి అంతర్దృష్టిని కలుగజీస్తుంది.

Tతారామాత (లారీ ప్రాట్)- ఒక యోగి ఆత్మకథ సంపాదకురాలు
యోగానందగారి నుండి తారామాతకు ప్రశంసా పత్రం

మన లౌరీప్రాట్‌ కు

“ఈ పుస్తకాన్ని బయటకు తీసుకురావడంలో నీ శౌర్యము మరియు ప్రేమతో కూడిన పాత్రను దేవుడు మరియు గురువులు ఎప్పుడూ ఆశీర్వదించుగాక. పి.వై.”

“చివరికి ఆ దేవుని, నా గురువుల మరియు మహాత్ముల పవిత్ర పరిమళం నా ఆత్మ యొక్క రహస్య ద్వారాల ద్వారా బయటకు వచ్చింది — అంతులేని కష్టాలు మరియు లౌరీ ప్రాట్, ఇతర శిష్యుల నిరంతర ప్రయత్నాల తరువాత. అన్ని కష్టాల మూటలు నిత్య ఆనందపు మంటల్లో కాలిపోతున్నాయి.”

శ్రీ శ్రీ మృణాళినీమాత

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క నాల్గవ అధ్యక్షులు, 2011-2017

“ఒక యోగి ఆత్మకథ దాని దివ్య విధికి బయలుదేరింది, చివరికి గురుదేవుల ఆశీస్సులను మరియు దేవుని ప్రేమను లక్షలాది అన్వేషించు ఆత్మల వద్దకు చేర్చుటకు.”

1946వ సంవత్సరము చివరలో, ఎన్సినీటస్ ఆశ్రమంలో ఒక సాయంత్రం, మేము యువ భక్తులము మా వంటగది విధులతో నిమగ్నమై ఉన్నపుడు గురుదేవులు అక్కడికి ద్వారం గుండా వచ్చారు. అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి మరియు మా దృష్టి ఆయన విశాలమైన చిరునవ్వు మరియు ఆయన కళ్ళలో సాధారణంగా కనిపించే మెరుపు కన్న అందమైన ప్రకాశంపై పూర్తిగా కేంద్రీకృతమయ్యింది. ఆయన చేయి ఆయన వెనుక ఉంది, “ఏదో” దాచిపెడుతూ. ఆయన మరికొంతమందిని రావాలసిందని పిలుపునిచ్చారు మరియు ఆయన ముందు మమ్మల్ని వరుసలో ఉంచారు. అప్పుడు ఆయన మా ముందు దాచిన నిధిని ప్రదర్శించారు — తన పుస్తకం, ఒక యోగి ఆత్మకథ యొక్క ముందస్తు కాపీ.

“ఆహో” మరియు “ఓహా” ల మధ్య, మేము భారతదేశంలోని గొప్ప సాధువులు మరియు ఋషులతో కలిసి ఆయన గడిపిన జీవిత వృత్తాంతాన్ని, మా సుదీర్ఘ నిరీక్షణ తరువాత చివరకు ఇలా చూడటంతో కలిగిన ఆనందాన్ని పూర్తిగా వ్యక్తపరచలేకున్నాము — ఆయన సాన్నిధ్యంలో మేము గడిపిన అత్యంత విలువైన గంటలలో వాటిని గురించి చెప్పి తరచుగా మమ్మల్ని మంత్రముగ్ధులను చేసేవారు. ఆయన కొన్ని పేజీలను తెరిచి మహావతార్ బాబాజీ పేజీ వద్దకు వచ్చి ఆగిపోయారు. దాదాపు ఊపిరి ఆగిపోయేటంత ఉత్కంఠతతో మేము మా భక్తి భావమును అర్పించాము మరియు మన పరమ-పరమ-పరమగురువుల రూపాన్ని చూసే భాగ్యము పొందిన మొట్టమొదటి వారిలో ఒకరిగా ఉండి ఆశీస్సులు పొందాము.

డిసెంబర్ ఆరంభంలో, ప్రచురణకర్త నుండి పుస్తకాల పార్శిల్ రాకతో చాలా మంది ఆసక్తిగల భక్తులకు పోస్ట్ చేయడానికీ, వాటిని సిద్ధం చేయడంలో పాల్గొనడానికీ — వందలాది ముందస్తు కొనుగోలుదారులకు పంపించడానికీ మమ్మల్ని అందర్నీ మౌంట్ వాషింగ్టన్ కు పిలిపించారు. కొన్ని వారాల ముందే మాలో ఎవరికైనా కొంత ఖాళీ సమయం ఉన్నప్పుడు మా పాత మాన్యువల్ టైప్‌రైటర్లలో ఒకదానితో చిరునామా లేబుల్‌లను టైప్ చేసే పనిలో ఉండేవాళ్ళం. ఆఫీసులో భారీ బల్లలు (పొడుగాటి మంచపు కోళ్ళపై సమమైన చెక్క పలక) ఏర్పాటు చేయబడ్డాయి, ప్రతి ఒక్క పుస్తకాన్నీ భారీ ఖాకీ మెయిలింగ్ పేపర్‌ రోల్‌తో చుట్టబడి తద్ద్వారా పుస్తకాలను పంపే నిర్వహణా పని అక్కడి నుండే జరుగుతుండేది, సరైన పరిమాణానికి చేతితో కత్తిరించడం, లేబుల్స్ మరియు తపాలా స్టాంపులను మొదటే తడి స్పాంజ్లతో తేమగా చేసి అతికించడం. ఆ రోజుల్లో ఆటోమేషన్ లేదా మెయిలింగ్ యంత్రాలు లేవు! కాని, ఓహో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ చరిత్రలో ఈ చిరస్మరణీయ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత ఆనందం. ఈ ఘనమైన సందేశవాహకం ద్వారా ప్రపంచం, ఆశీర్వదించబడ్డ మన గురుదేవులను తెలుసుకుంటుంది.

మూడో అంతస్తు కూర్చునే గదిలో, గురుదేవులు ఆయన వ్రాసుకునే బల్ల వద్ద గంటల తరబడి ఏకధాటిగా కూర్చుని ప్రతి పుస్తకాన్ని హస్తాక్షరించారు. పుస్తకాలను ప్రచురణకర్త యొక్క రవాణా డబ్బాల నుండి తీసి, తెరిచి మరియు ఆయన ముందు విస్తారంగా ఉంచబడేవి ప్రతిదానిపై ఆయన సంతకం చేసేవారు — ఒక ఫౌంటెన్ పెన్ను ఖాళీ అవుతుంటే, మరొకటి నింపుతూ ఉండేవాళ్ళము.

ఆయన నన్ను మేడమీదకు రమ్మని పిలిచినప్పటికే చాలా పొద్దుపోయింది. ఆయన అప్పటికీ పుస్తకాలను హస్తాక్షరిస్తున్నారు. అనుభవాగ్నులైన శిష్యులు కొంత విశ్రాంతి తీసుకోవాలని ఆయనను కోరారు, కాని ఆ రవాణాలోని వచ్చిన ప్రతి పుస్తకం తన ఆశీర్వాదాలతో సంతకం చేసేవరకు దాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి కూడా ఆయన నిరాకరించారు. ఆయన ముఖము దివ్యారవిందముతో వెలిగిపోతోంది, ఆయనలోని ఒక నిజభాగము వలె మరియు దేవుని పట్ల ఆయనకున్న ప్రేమ, ఆ ముద్రిత పేజీల ద్వారా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతోంది, అది ఒక్క అదనపు క్షణం కూడా ఆలస్యము కాకూడదు.

అనిర్వచనీయమైన ఆనందంతో మేము ప్రాతః కాలాన్నే ధ్యానం చేయడానికి ఆయన పాదాల వద్ద కూర్చున్నాము. ఈ నిధి యొక్క వ్యక్తిగత ప్రతిని గురుదేవులు మాలో ప్రతి ఒక్కరికీ అందజేశారు, మరియు మిగతా అన్ని ప్రతులు ఉదయం తపాల ద్వారా పంపుటకు చుట్టబడి ఉన్నాయి లేదా హాలీవుడ్ మరియు శాన్ డియాగోలోని ఆయన ఆలయాలకు పంపుటకు కట్టబడ్డాయి. ఒక యోగి ఆత్మకథ దాని దివ్యవిధికి బయలుదేరింది, చివరికి గురుదేవుల ఆశీస్సులను మరియు దేవుని ప్రేమను లక్షలాది అన్వేషించు ఆత్మల వద్దకు చేర్చుటకు.

శైలసుతమాత

“ఆయన రాత్రంతా నిర్దేశించిన సందర్భాలు మరియు కొన్ని సార్లు రోజంతా లేదా అంతకంటే ఎక్కువ సమయం కొనసాగిన సందర్భాలు కూడా ఉన్నాయని నాకు గుర్తు.”

పరమహంసగారు ఒక యోగి ఆత్మకథ, వ్రాస్తున్న సమయంలో ఎన్సినీటస్ ఆశ్రమంలో మాలో కొద్దిమంది మాత్రమే నివసిస్తుండేవారము, ఈ బృహత్తర కార్యము పూర్తి కావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో కొంతకాలము నేను అక్కడే నివసించాను.

గురూదేవులు తన పుస్తకంలో ఎక్కువ భాగం ఆశ్రమములోని తన పఠనమందిరములోనే వ్రాశారు. ఆయన రాత్రంతా నిర్దేశించే సందర్భాలు, మరియు కొన్ని సార్లు రోజంతా లేదా అంతకంటే ఎక్కువ సమయం కొనసాగిన సందర్భాలు కూడా ఉన్నాయని నాకు గుర్తు. దయామాత మరియు ఆనందమాత చేసే కార్యదర్శి విధులలో నేను పాల్గొనలేదు, ఆయన మాటలను వాళ్ళు కొన్నిసార్లు సంక్షిప్త లిపిలో మరియు ఇతర సమయాల్లో టైప్‌రైటర్‌ను ఉపయోగించి నమోదు చేసుకొనేవాళ్ళు. నా బాధ్యత చాలావరకు వారి భోజనం వండటం, దానితో వారు నిరంతరాయంగా పని చేసుకునేవారు!

ఒక యోగి ఆత్మకథ ప్రచురణకర్త నుండి వచ్చినప్పుడు, ఓ గొప్ప ఉత్సవంలా ఉండింది. ముందస్తు ఆర్డర్ లు ఇచ్చిన వారందరికీ గురుదేవులు తన పుస్తకాన్ని తక్షణమే పంపాలని కోరారు! కాబట్టి ప్రారంభ వేడుక తరువాత, పెద్దఎత్తున సేకరించిన మునుపటి ఆర్డర్లను పంపించడంలో మేము కార్యనిమగ్నులమై ఉన్నాము. సిస్టర్ షీలా మరియు నేను చాలా కాపీలు చుట్టి, ప్యాకేజీలను స్టాంప్ చేసి, వాటినన్నిటినీ సిద్ధం చేశాము. తరువాత మేము కారు తీసుకువచి, ట్రంక్ మరియు అన్ని తలుపులు తెరిచాము. కారు పూర్తిగా నిండిన తరువాత, మేము పుస్తకాల పార్శిల్ ను లాస్ ఏంజిలిస్ లోని ప్రధాన తపాలా కార్యాలయానికి నడిపించాము. చివరికి ఒక యోగి ఆత్మకథ ప్రతి చోటా ప్రజలకు అందుబాటులోకి వస్తోందని మేము చాలా సంతోషపడ్డాము.

స్వామి ఆనందమోయ్

“నేను కోరుకున్నది నాకు దొరికినదని నా మనసులో నాకు తెలుసు, మరియు పరమహంస యోగానందగారి బోధనలను అధ్యయనం చేసి, భగవంతుడిని కనుగొనటానికి నా మనస్సులో నిర్ణయించుకున్నాను.”

స్విట్జర్లాండ్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన వింటర్‌థుర్ పట్టణానికి సమీపములోని గ్రామంలో నేను ఆంటీ, అంకుల్ తో వేసవి సెలవులను గడిపినప్పుడు నేను నా యుక్త వయసులో ఉన్నాను. మా అంకుల్ సంగీతకారుడు, సింఫనీ ఆర్కెస్ట్రా సభ్యుడు. ఆయన కూడా సెలవులో ఉన్నారు, ఆ సమయాన్ని తన పెద్ద ఉద్యానవనంలో పని చేస్తూ గడిపేవారు. నేను ఆయనకు సహాయం చేసేవాణ్ణి. వారికి పిల్లలు లేనందున, వారు నాపై చాలా ఆసక్తి చూపించేవారు, మరియు తోట పని చేసే సమయంలో చాలా కాలం పాటు మా “మాటల చర్చలు” ఉండేవి. మా అంకుల్, తూర్పు తత్వశాస్త్రంపై అమితమైన ఆసక్తిని కలిగి ఉండేవారు, కర్మ, పునర్జన్మ, సూక్ష్మ, కారణ మండలాలు మరియు ముఖ్యంగా సాధువులపై — ఆత్మ సాక్షాత్కరం సాధించిన గురువుల గురించి ఆయన చేసిన ఉపన్యాసాలను నేను చాలా శ్రద్ధగా వినేవాడిని.

ఆయన నాకు బుద్ధుని గురించి మరియు ఆయన చేరుకున్న ఉన్నతస్థితి గురించి మరియు ఇతర సాధువుల గురించి చెప్పారు, ఇది వారి అడుగుజాడల్లో నడవాలనే గాఢమైన కోరికను నాలో ప్రేరేపించింది. ఆత్మ సాక్షాత్కరం, ఆత్మ సాక్షాత్కరం: అంటూ మనసులో మళ్ళీ మళ్ళీ పునరావృతం చేస్తు తిరగడం నాకు గుర్తుంది. ఈ పదం యొక్క పూర్తి అర్థాన్ని నేను అర్థం చేసుకోకపోయినా, ఇది సాధారణ మానవుడి భావన కంటే చాలా గొప్పదని నాకు తెలుసు, అతను తన భౌతిక లేదా కళాత్మక వృత్తిలో ఎంత సాధించినా కూడా. ఆ స్థితిని ఎలా సాధించగలరని నేను మా అంకుల్ ను అడిగాను, కాని ఆయన ధ్యానం చెయ్యాలి అని మాత్రమే చెప్పగలిగేవారు. కాని ఎలా, అనేది ఆయనకు తెలియదు. సకలమూ నేర్పించగలిగే గురువు ఉండాలి అని అన్నారు. ఒకరిని కలవాలనే నా గొప్ప కోరికను నేను వ్యక్తం చేసినప్పుడు, ఆయన తల ఊపుతూ చిరునవ్వుతో, “ఓ నా అమాయకపు అబ్బాయ్, స్విట్జర్లాండ్‌లో గురువులు లేరు!” అని అన్నారు.

దాంతో నేను గురువు కోసం ప్రార్థించడం మొదలుపెట్టాను. గురువు కోసం నా ఆత్రుత ఎంత గొప్పదంటే, నేను మా ఊరికి తిరిగి వచ్చిన తరువాత, “ఆయన” వస్తారు అనే ఆశతో నేను రైలు స్టేషన్‌కు వెళ్ళి, గంటల తరబడి వేచి ఉండే వాడిని. కాని ఏమీ జరగలేదు.

నేను పాఠశాలలో విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నిష్ఫలమైన రెండు సంవత్సరాలు నా తండ్రి వ్యాపారంలో పనిచేశాను. అప్పటికి, నేను హిందూ తత్వశాస్త్రంపై నా ఆసక్తిని వదులుకున్నాను, ఎందుకంటే నేను గురువును కనుగొంటాననే ఆశ సన్నగిల్లింది. నేను కళలలో వృత్తిని ప్రారంభించాను, మూడేళ్ల తరువాత ప్రసిద్ధ భవన నిర్మాణ శిల్పి ఫ్రాంక్ లాయిడ్ రైట్‌తో కలిసి చదువుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ కు రమ్మన్ని నన్ను ఆహ్వానించారు.

అమెరికాలో నా మొదటి వారంలో, ఈ దేశానికి 1920లలో వలస వచ్చిన ఒక అంకుల్ ను కలిశాను. ఒక సంభాషణలో ఆయన హిందూ తత్వాన్ని ప్రస్తావించారు. సంవత్సరాల క్రితం ఈ విషయంపై నాకు ఆసక్తి ఉండేదని నేను ఆయనతో చెప్పగానే, ఆయన ముఖం వెలిగిపోయింది మరియు నన్ను తన వ్యక్తిగత పఠణాగృహానికి తీసుకు వెళ్ళి ఒక యోగి ఆత్మకథను నాకు చూపించారు. ముఖచిత్రంలో పరమహంస యోగానందగారి చిత్రాన్ని చూపిస్తూ, “నీవు వీరి గురించి ఎప్పుడైనా విన్నావా?” అని అడిగారు. నేను లేదు అని జవాబు ఇచ్చాను, ఆయన ఇలా అన్నారు, “నేను ఇప్పటి వరకు చూసిన వారందరిలోకి చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిజమైన గురువు!”

“మీరు ఆయన్ని చూశారా?” నేను పూర్తిగా ఆశ్చర్యంతో అరిచాను. “ఆయన ఎక్కడ ఉన్నారు — అమెరికాలో లేరా?”

“అవును, ఆయన లాస్ ఏంజిలిస్ లో నివసిస్తున్నారు. “ఆయన ఈ దేశానికి వచ్చిన వెంటనే పరమహంసగారు ఇచ్చిన ఉపన్యాసాలు మరియు తరగతులకు ఎలా హాజరయ్యారో నాకు చెప్పారు. ఆలోచించడానికి, ఇన్ని సంవత్సరాలు నేను గురువు కోసం ఆరాటపడుతున్నప్పుడు, అంకుల్ కు ఒక గురువు మరియు ఆయన బోధనలు తెలుసు!

నేను ఆతృతతో ఆ పుస్తకాన్ని చదివాను. అది మొదటి అలౌకిక ఘటన. నేను ఎంత మంత్రముగ్ధుడనైయ్యానంటే, ఇది ఒక అలౌకిక ఘటన అని కూడా గమనించలేదు — ఒక పుస్తకాన్ని చదవడానికి తగినంత ఇంగ్లీష్ కూడా నాకు రాదు. ఫ్రాంక్ లాయిడ్ రైట్ కూడా తన ఆత్మకథ వ్రాశారు, కాని మొదటి కొన్ని పేజీలను చదవడానికి నేను చేసిన ప్రయత్నము ఫలించలేదు. నేను ఆ పుస్తకాన్ని చదవడానికి ముందు నాకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక అదనపు సంవత్సరం పట్టింది. కాని నేను ఒక యోగి ఆత్మకథను మొదటి నుండి చివరి వరకు చదవగలిగాను.

నేను కోరుకున్నది నాకు దొరికినదని నా మనసులో నాకు తెలుసు, మరియు పరమహంస యోగానందుల బోధలను అధ్యయనం చేసి, భగవంతుడిని కనుగొనటానికి నా మనస్సులో నిర్ణయించుకున్నాను.

కొన్ని నెలల తరువాత, నేను ఇంకా బాగా ఇంగ్లీష్ నేర్చుకున్న తరువాత, గురుదేవులను చూడాలనే ఆశతో లాస్ ఏంజిలిస్ కు ఒక యాత్ర చేయగలిగాను. నేను మదర్ సెంటర్ మైదానంలోకి ప్రవేశించగానే, నేను ఇంతకు ముందు ఎప్పుడు అనుభవించని విధంగా, నాకు మహత్తరమైన శాంతి లభించింది. నేను పవిత్ర భూమిపై నిలబడ్డానని నాకు అర్థమయ్యింది.

ఆదివారం ఉదయం నేను హాలీవుడ్ ఆలయంలో పరమహంసగారి ప్రాతఃకాలపు సేవకు హాజరయ్యాను. నేను ఆయనను ముఖాముఖిగా చూడటం అదే మొదటిసారి. అది ఒక మరపురాని అనుభవం. సేవ తరువాత, గురుదేవులు ఒక కుర్చీపై కూర్చున్నారు మరియు ప్రార్థనకు వచ్చిన చాలా మంది ఆయనను పలకరించడానికి వెళ్ళారు. నేను వరుసలో నిలబడినప్పుడు నా మనస్సులోని భావనలను నేను మాటల్లో వ్యక్తపరచలేను. చివరగా నేను ఆయన ముందు నిలబడినప్పుడు, ఆయన నా చేతిని ఆయన చేతిలోకి తీసుకున్నారు మరియు నేను ఆ లోతైన ప్రకాశవంతమైన మృదువైన కళ్ళలోకి చూశాను. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వర్ణించలేని ఆనందం ఆయన చేతి ద్వారా మరియు కళ్ళ ద్వారా నాలోకి ప్రవహించింది.

నేను ఆలయం నుండి బయలుదేరి సన్‌సెట్ బౌలేవార్డ్ వెంట దిగ్భ్రాంతిలో నడిచాను. నేను ఆనందంలో మైమరచిపోయి నేరుగా నడవలేకున్నాను. నేను తాగుబోతులాగా తూలిపోయాను. అంతే కాదు, నా ఆనందాన్ని లోపల ఇముడ్చుకోలేకపోయాను మరియు బిగ్గరగా నవ్వుతూ ఉన్నాను. ప్రక్క నుండి నడిచే వాళ్ళు తిరిగి తదేకంగా చూశారు; మరియు నా దగ్గరగా నడుస్తున్న వారు, ఆదివారం ఉదయం బహిరంగంగా మద్యపానం చేసినట్లుగా భావించిన వారు అసహ్యంతో తలలు ఊపుతూ అడ్డు తప్పుకున్నారు. నేను పట్టించుకోలేదు. నేను ఇంత సంతోషంగా నా జీవితంలో ఎప్పుడూ లేను.

ఈ అనుభవం తర్వాత కొంతకాలానికే, నేను సన్యాసిగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ఆశ్రమంలో ప్రవేశించాను.

స్వామి ప్రేమమోయ్

మంత్రముగ్ధులై, ఆయన మొత్తం పుస్తకాన్ని ఏకధాటిగా కూర్చొన్న దగ్గర నుండి లేవకుండా పూర్తి చేశారు. తనకు ఎదురైన వారందరికన్నా మించిన ఆధ్యాత్మిక ప్రావీణ్యత రచయితకు ఉందని గుర్తించిన ప్రేమమోయ్ గారు పరమహంస యోగానందగారికి వ్రాయాలని నిర్ణయించుకున్నారు.

ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా పరమహంస యోగానందగారి సన్యాస శిష్యుడు, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మినిస్టర్ అయిన స్వామి ప్రేమమోయ్ గారు 1990లో ఈ లోకాన్ని విడిచి వెళ్ళే వరకు సన్యాస వరుసలోని యువ సన్యాసుల ఆధ్యాత్మిక శిక్షణకు బాధ్యత వహించారు. ఆయన ఈ కథను వారికి వివరించారు.

స్వామి ప్రేమమోయ్ స్లోవేనియాలో జన్మించారు. రాజ కుటుంబీకులతో మరియు పలుకుబడి ఉన్న ఇతరులతో ఆయన కుటుంబానికి ఉన్న సంబంధాల కారణంగా, రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో కమ్యూనిస్తులు తన స్థానిక భూమిని స్వాధీనం చేసుకున్న తరువాత ఆయన పారిపోవలసి వచ్చింది. 1950లో, యు.ఎస్. విదేశాంగ శాఖ ఆయనను అమెరికాకు వలస రమ్మన్ని ఆహ్వానించింది.

1950 చివరలో న్యూయార్క్ వెళ్ళడానికి ముందు, స్వామి ప్రేమమోయ్ కుటుంబానికి పాత స్నేహితురాలు ఎవెలినా గ్లాన్జ్మాన్ వీడ్కోలు బహుమతి ఇచ్చారు. బహుమతి యొక్క ఆకారం అది మిఠాయి పెట్టె అని అనుకోవటానికి దారితీసింది, ఓడలో ఆయన తోటి ప్రయాణీకులతో పంచుకోవడానికి దానిని తెరిచాడు. ఆయన ఆశ్చర్యపోయారు, అది మిఠాయి ప్యాకెట్ కాదు, ఒక పుస్తకం — ఒక యోగి ఆత్మకథ.

బహుమతి హృదయాన్ని స్పృశించినప్పటికీ, ప్రేమమోయ్ గారు వెంటనే దానిని చదవడానికి మొగ్గు చూపలేదు. ఆయన చిన్నతనంలో విపరీతమైన ఆసక్తిగల పాఠకుడిగా ఉన్నప్పటికీ, ఆ రోజులు ముగిశాయి (తరువాత ఆయన ఇలా చెప్పారు, తన జీవితాంతం చదివిన దానికంటే పదిహేనేళ్ల వయస్సులోపు ఎక్కువ పుస్తకాలు చదివానని చెప్పారు). అలాగే, తూర్పు తత్వశాస్త్రంతో ఆయనకి బాగా పరిచయం ఉంది, యుక్తవయసులో ఉన్నప్పుడు భగవద్గీతతో ప్రేమలో పడ్డారు మరియు చాలావరకు కంఠస్థం చేసుకున్నారు. ఇప్పుడు, ఈ బహుమతి పుస్తకం యొక్క విషయాన్ని చూసి, ఆయన మొదటి ప్రతిక్రియ ఏమిటంటే, “నేను దీన్ని చదవడం లేదు — నేను దేనిలోనూ పడదలచుకోలేదు!”

అమెరికాలో, ఆయన వివిధ వ్యాపార సంస్థలలో పాలుపంచుకున్నాడు మరియు చివరికి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ డాగ్ హమ్మర్స్క్‌జోల్డ్‌కు వ్యక్తిగత సహాయకుడిగా స్థానం పొందాడు. (కాలిఫోర్నియాకు రాకముందే ఆయన ఈ పదవిని తిరస్కరించారు.) నెలలు గడిచాయి — మరియు ఆత్మకథ న్యూయార్క్‌లోని ప్రేమమోయ్ గారి ఇంటి వద్ద, చదవకుండా, అల్మారాలోనే ఉంది. ఈ సమయంలో, శ్రీమతి గ్లాన్జ్మాన్ (ఆత్మకథ ఇటాలియన్ ప్రచురణకు అనువాదకురాలు) పుస్తకం గురించి ఆమె స్నేహితుడి అభిప్రాయాన్ని అడుగుతున్నారు. అయినప్పటికీ స్వామి ప్రేమమోయ్ ఆ పేజీలను తెరిచి చూడలేదు. చివరగా శ్రీమతి గ్లాన్జ్మాన్ ఈ ప్రభావవంతమైన పదాలు రాశారు: “మీకు నచ్చిందని చెప్పండి లేదా మీకు నచ్చలేదని చెప్పండి; కానీ ఏదో ఒకటి చెప్పండి!” విచారగ్రస్థమైన మానసిక స్థితిలో ఉన్నారు — మార్చి 6, అది ఆయన పుట్టినరోజు, తన జీవితంలో ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు — ఆయన పుస్తకాన్ని తీసుకొని చదవడం ప్రారంభించారు.

మంత్రముగ్ధులై, మొత్తం పుస్తకాన్ని ఏకధాటిగా కూర్చొన్న దగ్గర నుండి లేవకుండా ఆయన పూర్తి చేశారు. రచయితకు తనకు ఎదురైన వారందరికన్నా మించిన ఆధ్యాత్మిక అవగాహన ఉందని గుర్తించిన ప్రేమమోయ్ గారు పరమహంస యోగానందులవారికి వ్రాయాలని నిర్ణయించుకున్నారు.

లేఖను పోస్ట్ చేస్తున్నప్పుడు, గురుదేవులు ఈ భూమి మీద తన చివరి రోజును జీవిస్తున్నారని ప్రేమమోయ్ గారికి తెలియదు.

కొంతకాలం తరువాత, శ్రీ దయామాత తన లేఖకు సమాధానమిచినప్పుడు, స్వామి ప్రేమమోయ్ గురుదేవులు పరమపదించిన విషయం తెలుసుకున్నారు. చాలా నెలలు గడిచాయి; ప్రేమమోయ్ గారు పుస్తకం మరియు దాని రచయిత గురించిన ఆలోచనను తన మనస్సు నుండి తొలగించలేకపోయారు, మరియు ఆ వేసవికాలంలో ఆయన పరమహంసగారి బోధనల గురించి మరింత తెలుసుకోవడానికి లాస్ ఏంజిలిస్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయానికి వెళుతుండగా, వెంటనే ఓ అపరిచితుడు చిరునవ్వుతో ఆయనను పలకరించాడు. ప్రకాశవంతమైన చిరునవ్వుతో, ఆ వ్యక్తి ఆయనను పాత మిత్రుడిలా ఆప్యాయంగా ఆదరించాడు — దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నట్లు మరియు ఘనస్వాగతముతో. మాటల మార్పిడి జరగలేదు, కొంత సమయం తరువాత ప్రేమమోయ్ గారిని తన కొత్త “పాత స్నేహితుడికి” అధికారికంగా పరిచయం చేశారు — శ్రీ శ్రీ రాజర్షి జనకానంద, సంస్థ అధ్యక్షులు!

ఈ విధంగా, పరమహంసగారు తన “సందేశ వాహకం”గా పేర్కొన్న పుస్తకం మరో ఆత్మపై తన మాయాజాలాన్ని ప్రదర్శించింది — ఆ రోజు నుండి, స్వామి ప్రేమమోయ్ జీవిత గమనం చక్కదిద్దబడింది.

సిస్టర్ శాంతి

“నేను రాత్రి చదివేదాన్ని మరియు నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఆమె (మా అమ్మ) చదివేది. సత్యప్రపంచంలోకి ప్రవేశించే అనుభవంలో మేము మునిగిపోయిన విధానాన్ని వివరించడానికి “పఠనం” అనే పదం బహుశా సరిపోదు. జీవితం యొక్క మూలము, శిష్యత్వం, క్రియాయోగ విధివిధానం — అన్నీ ఒక యోగి ఆత్మకథలో స్పష్టం చేయబడ్డాయి.”

అది 1952, నేను లాస్ ఏంజిలిస్ లోని విల్షైర్ బౌలేవార్డ్‌లోని అంబాసిడర్ హోటల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌కు కార్యదర్శిగా పనిచేయుచున్నను: నేను ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకునే దాన్ని, ఒక ఉన్నత వర్గంలో ఒక మనోహరమైన ఉద్యోగం. కానీ నా చెవిలో చెప్పిన ఒక పేరు యొక్క శబ్దం నా జీవితంపై చూపించే ప్రభావం గురించి నాకు కొంచమే తెలుసు.

మార్చి 6న, చలనచిత్ర నిర్మాతకు కార్యదర్శి హోటల్‌కు కాల్ చేసి పరమహంస యోగానందగారికి ఒక సందేశం పంపిచమని కోరారు. నేను ఆ పేరు విన్న క్షణంలోనే, నా గుండెలో భారీ “గంట” మోగింది; నా తల ఈదులాడింది, ఆనందం నా హృదయం మరియు మనస్సులోకి పయనించింది, మరియు సందేశం పంపించే ఏర్పాట్లు చేయడానికి నేను రిజర్వేషన్ల డెస్క్‌కు వెళ్ళుతున్నప్పుడు నేను నేరుగా నడవలేకపోయాను. భారత రాయబారి మరియు ఆయన పరివారము ప్రస్తుతం అక్కడే నివాసంలో ఉన్నప్పటికీ, ఆ పేరును హోటల్‌లో నమోదు చేయలేదని నాకు చెప్పబడింది. నా కార్యాలయానికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పేరు నా మనసులో తిరుగుతూనే ఉంది మరియు నేను మరింత ప్రేమ మరియు ఆనందంతో నిండిపోయాను. కొద్దిసేపటి తరువాత చలనచిత్ర నిర్మాత కాల్ చేసి, “నా కార్యదర్శి మీకు ఏ పేరు చెప్పాడు?” అని అడిగారు. నేను ఆయనతో “పరమహంస యోగానంద” అని చెప్పాను ఆయన ఆశ్చర్యపోయాడు, “అదే ఆయన చెప్పినట్లు నేను విన్నాను! నేను అతనికి ఇచ్చిన పేరు అది కాదు. అతను ఎందుకు అలా చెప్పాడో అతనికే తెలియదు!”

మిగిలిన ఆ రోజంతా నేను ఒక విచిత్రమైన అంతర్గత అవగాహన స్థితిలో ఉండి, ఆ పేరుతో అనుసంధానంతో గాఢమైన భావాన్ని అనుభవించాను. అప్పుడు మార్చి 7, పరమహంస యోగానందగారు మహాసమాధి చెందిన నిర్ణీత రోజు వచ్చింది. నేను దాని గురించి వార్తాపత్రికలో చదివాను మరియు నా ప్రియ మిత్రుడిని కోల్పోయానని భావించాను. అది చాలా విచారకరమైనది! నా జీవితం అకస్మాత్తుగా ముగిసినట్లు అనిపించింది. నేను ఆలోచిస్తూనే ఉన్నాను, నేను ఆయనను కోల్పోయానని! నేను ఆయన కోసం నా జీవితమంతా ఎదురు చూశాను కానీ నేను ఆయనను కోల్పోయాను! నేను ఒక గురువు లేదా ఒక మార్గం కోసం వెదకడం లేదు. కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటో నాకు నిజంగా తెలియదు. అయినప్పటికీ, నా మనస్సు లోతులలో ఇది నిజమని నాకు తెలుసు, నా జీవితకాలంలో అతి ముఖ్యమైన వ్యక్తిని నేను కోల్పోయాను.

ఆ క్షణం నుండి నా చక్కటి, ఆకర్షణీయమైన జీవితం నాకు ఇక సరిపడలేదు. నేను అకస్మాత్తుగా ముఖ్యమైన ప్రణాళికలను రద్దు చేసుకున్నాను, నాకు తెలిసిన వ్యక్తులను చూడటం మానేశాను మరియు పుస్తకాల ద్వారా అన్వేషించడం ప్రారంభించాను. పరమహంస యోగానందగారు ఎప్పుడైనా ఒక పుస్తకం వ్రాశారా అని చూడాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు; నాకు ఎల్లప్పుడు ఆయన వెళ్ళిపోయారని మరియు నేను ఆయన్ని కోల్పోయాననే అనిపించేది. నా అవసరాన్ని లోతుగా తీర్చలేని అధిభౌతికానికి సంబంధించిన నాలుగు సంపుటములను చదివిన తరువాత, హాలీవుడ్ పబ్లిక్ లైబ్రరీలో అదే వరుసలోని పుస్తకాలను నా తల్లితో వెళ్ళి తిరిగి వెతుకుతున్నాను, నాలో రగులుతున్న ఆధ్యాత్మిక అగ్నిలో కొంత భాగాన్ని ఆమె పంచుకున్నది. నేను ఇప్పటికే పూర్తిగా పరిశీలించానని భావించిన మొదటి విభాగాన్ని దాదాపు దాటిన తరువాత, ఒక పుస్తకం పై అల్మారా నుండి పడి, నా తలకు తగిలి, నేలపైకి ఎగిరిపడింది. నా తల్లి దాన్నితీసి ఆరాటపడుతూ నా వైపుకు తిప్పింది — పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ. అక్కడ నా ముందు, నా హృదయం వెతికే పేరు, మరియు ఆత్మలోకి చొచ్చుకుపోయే కళ్ళుగల ముఖం కనిపించాయి!

నేను రాత్రి చదివేదాన్ని మరియు నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అమ్మ చదివేది. సత్య ప్రపంచంలోకి ప్రవేశించే అనుభవంలో మేము మునిగిపోయిన విధానాన్ని వివరించడానికి “పఠనం” అనే పదం బహుశా సరిపోదు. జీవితం యొక్క మూలము, శిష్యత్వం, క్రియాయోగ విధి విధానం — అన్నీ ఒక యోగి ఆత్మకథలో స్పష్టం చేయబడ్డాయి.

మేము హాలీవుడ్ ఆలయంలో ఒక సేవకు హాజరయ్యాము, ఎలాగైతే నేను మొదట టెలిఫోన్లో గురుదేవుల పేరు విన్న ఉదయం ఎంత ఉత్సాహం కలిగిందో, అప్పుడూ అదే “సాన్నిధ్యం”లో నేను మునుగిపోయాను. సేవ తరువాత మీరామాత మమ్మల్ని చాలా ఉదారంగా ఆదరించారు కొన్ని క్షణాల తరువాత నన్ను మౌంట్ వాషింగ్టన్ వెళ్ళమని సూచించారు, మదర్ సెంటర్ లో తన కుమార్తె అయిన మృణాళినీమాతను కలవమన్నారు. మేము వెళ్ళి సన్యాసుల క్రమం గురించి తెలుసుకున్నాము, మరియు నేను మూడవ సారి “మంత్రముగ్దురాలినయ్యాను” — మొదట పరమహంస యోగానందగారి చేత, రెండవది ఒక యోగి ఆత్మకథ ద్వారా, మరియు ఇప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి భగవంతునికి మాత్రమే అంకితమివ్వబడిన ఆదర్శ జీవితం ద్వారా.

మార్చి 6న పరమహంసగారి పేరు విన్నప్పుడు నాపై ఉన్న ప్రభావం గురించిన కథను వివరించిన తరువాత, ఆయన ఆ రోజు ఉదయం హోటల్‌లో ఉన్నట్లు తెలుసుకున్నాను, అమెరికాలోని భారతదేశ రాయబారి బినాయ్ ఆర్. సేన్ తో ప్రాతఃకాల భోజనమునకు హాజరయ్యారు. ఆ భోజనము జరిగిన గది నా కార్యాలయం పక్క గదియే. నేను కాల్ తీసుకుని ఆయన పేరు విన్న సమయంలో గురుదేవులు నా రాతబల్ల ఉన్న గోడకు అవతలి వైపు కూర్చున్నారు.

గురుదేవులు తన మహత్తరమైన ఆత్మకథ ద్వారా “తన సొంత” వారిని పిలుస్తున్నారు. మనలో కొందరు ప్రతిస్పందించడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొని నాకు జరిగినట్లుగా తలపై కొట్టించుకుంటారు! కానీ ఆయన “స్వరం” విని, ఆయన శంఖారావమునకు సమాధానం ఇచ్చే లక్షలాది మందిలో ప్రతి ఒక్కరూ ఎంతో ధన్యులు.

ఇతరులతో పంచుకోండి