భగవద్గీతలో దాగి ఉన్న సత్యాలు

అత్యంత ప్రశంసలు పొందిన పరమహంస యోగానందగారి భగవద్గీత యొక్క రెండు సంపుటాల వ్యాఖ్యానం నుండి సారాంశాలు: God Talks With Arjuna ­— The Bhagavad Gita

భగవద్గీత: ఒక సార్వత్రిక గ్రంథము

గీత యొక్క కాలాతీత మరియు సార్వత్రిక సందేశం దాని సత్యాన్ని వ్యక్తీకరించడంలో సర్వమునూ సంకలనం చేసుకొని ఉంటుంది.

భగవద్గీత అంటే “పరమాత్మ యొక్క గానం,” మనిషికి మరియు అతని సృష్టికర్తకు మధ్య సత్య-సాక్షాత్కారానికి సంబంధించిన దివ్య-సంయోగం, ఆత్మ ద్వారా పరమాత్మ యొక్క బోధలను ఎడతెగకుండా గానం చేయాలి…. ప్రపంచంలోని అన్ని గొప్ప గ్రంథాలలో అంతర్లీనంగా ఉన్న ముఖ్యమైన సత్యాలకు, గీతలోని కేవలం 700 సంక్షిప్త శ్లోకాల అనంతమైన జ్ఞానానికి మధ్య సాధారణమైన సయోధ్యను కనుగొనవచ్చు.

విశ్వం యొక్క జ్ఞానమంతా గీతలో నిండి ఉంది. అత్యంత గాఢమైనది, అయినప్పటికీ ఓదార్పునిచ్చే సరళతతో కూడిన అందమైన ద్యోతక భాషలో ఉండే గీతను, మానవ ప్రయత్నాలు మరియు ఆధ్యాత్మిక పోరాటాల యొక్క అన్ని స్థాయిల్లోను ఆకళింపుచేసుకొని, అన్వయించబడింది–వారి భిన్నమైన స్వభావాలు మరియు అవసరాలతో మానవుల యొక్క విస్తారమైన వర్ణమాలకు ఆశ్రయం కల్పిస్తుంది. భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళే మార్గంలో ఎక్కడున్నవారికైనా, మార్గంలోని తదనుగుణ అంశానికి వెలుగును ప్రసరింపజేస్తుంది.

గీత యొక్క యోగ సంకేతం మరియు ఉపమానము యొక్క గుట్టును విప్పడం

రథంలో కృష్ణార్జునులుపురాతన పవిత్ర గ్రంథాలు చరిత్రను సంకేతశాస్త్రం నుండి స్పష్టంగా వేరు చేయలేదు; బదులుగా, వారు తరచుగా గ్రాంథిక ఉపదేశ సంప్రదాయంలో రెండింటినీ కలుపుతారు. ప్రవక్తలు వారి దైనందిన జీవితం మరియు వారి కాలంలోని సంఘటనల ఉదాహరణలను ఎంచుకుంటారు, వారి నుండి సూక్ష్మమైన ఆధ్యాత్మిక సత్యాలను వ్యక్తీకరించడానికి అనుకరణలను చిత్రిస్తారు. సాధారణ పదాలలో నిర్వచించబడకపోతే, దివ్యమైన నిగూఢతలను సాధారణ మనిషి ఊహించలేడు. వారు తరచుగా చేసినట్లుగా, గ్రంథ ప్రవక్తలు మరింత పునర్నిర్మించబడిన రూపకాలు మరియు ఉపమానాలలో వ్రాసినప్పుడు, అది అజ్ఞానులు, అంటే ఆధ్యాత్మికంగా సిద్ధంగా లేని మనస్సుల నుండి పరమాత్మ యొక్క నిగూఢమైన వ్యక్తీకరణాన్ని దాచి ఉంచడమే అవుతుంది.

ఈ విధంగా వ్యాస మహర్షి భగవద్గీతను చాలా తెలివిగా మానసిక మరియు ఆధ్యాత్మిక సత్యాలతో ఉపమానం, అన్యాపదేశం మరియు అలంకారాల భాషలో చారిత్రక వాస్తవాలను సమ్మిళితం చేసి, భౌతిక మరియు ఆధ్యాత్మిక మానవుని యొక్క ఉత్కంఠభరితమైన అంతః పోరాటాలను పదచిత్రంగా ప్రదర్శించారు. సంకేతశాస్త్రపు కఠినమైన కవచంలో, భూమిపై శ్రీ కృష్ణుడి అవతార సమాప్తితో పాటు అంధకార యుగాల అజ్ఞానం వైపుకు దిగజారుతున్న నాగరికతను ఆ వినాశనం నుండి రక్షించడానికి లోతైన ఆధ్యాత్మిక అర్థాలను దాచిపెట్టారు.

 
para-ornament

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు యోగ శాస్త్రానికి సంబంధించిన ఓక లోతైన గ్రంథం, భగవంతునితో ఐక్యత మరియు దైనందిన జీవనానికి ఒక పాఠ్య పుస్తకం. విద్యార్థి అర్జునుడితో కలిసి అంచెలంచెలుగా ఆధ్యాత్మిక సందేహం మరియు బలహీన హృదయం యొక్క మర్త్య చైతన్యం నుండి దివ్య-అనుసంధానం మరియు అంతరంగ-నిశ్చయము వైపు నడిపించబడతాడు.

భగవద్గీత—ఒక సమగ్ర ఆధిభౌతిక మరియు మానసిక గ్రంథం—విముక్తి మార్గంలో ఆధ్యాత్మిక యాత్రికుడికి వచ్చే అన్ని అనుభవాలను…. భక్తుడు సాధించాలని ప్రయత్నించే అనుకూల స్థితులు [మరియు] భక్తుడిని ఏమార్చడానికి మరియు అతని లక్ష్యం నుండి అతనిని పడవేయడానికి ప్రయత్నించే ప్రతికూల స్థితులను కూడా వివరిస్తుంది. “ముందుగా హెచ్చరించుట ముందుగా సాయుధుడగుటయే!” తాను ప్రయాణించాల్సిన మార్గాన్ని అర్థం చేసుకున్న భక్తుడు అనివార్యమైన వ్యతిరేకతను చూసి ఎప్పటికీ సందేహించడు లేదా నిరాశ చెందడు.

దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక పోరాటం మరియు అంతిమ విజయం

భగవద్గీత యొక్క కాలాతీత సందేశం కేవలం ఒక చారిత్రక యుద్ధాన్ని మాత్రమే కాక మంచి-చెడుల మధ్య విశ్వ సంఘర్షణను సూచిస్తుంది: ఆత్మ మరియు పదార్థం, ఆత్మ మరియు శరీరం, జీవితం మరియు మరణం, జ్ఞానం మరియు అజ్ఞానం, ఆరోగ్యం మరియు వ్యాధి, శాశ్వతత్వం మరియు చంచలత్వం, స్వీయ-నియంత్రణ మరియు ప్రలోభాలు, విచక్షణ మరియు ఇంద్రియలోల గుడ్డి మనసు….జీవితంలోని ఇలాంటి ద్వంద్వాల మధ్య యుద్ధాల పరంపరను సూచిస్తుంది.

తన జీవితం ఎంతవరకు అహంకారపూరితమైన అజ్ఞానంతోను (మాయ) మరియు శారీరక స్పృహతోను పాలించబడుతోందో, ఆత్మజ్ఞానం మరియు దివ్య స్వభావాన్ని అతను ఎంతవరకు వ్యక్తపరచగలుగుతున్నాడో నిర్థారించుకోవడానికి భక్తుడు ప్రతిరోజు తన మానసిక మరియు శారీరక చర్యలను విశ్లేషించుకోవాలి.

ధ్యాన యోగం అనేది ఆత్మ చైతన్యం ద్వారా సంకుచిత అహం, లోపభూయిష్ట పారంపర్య మానవ చైతన్యాన్ని నిర్మూలించి, ఖచ్చితమైన ఆధ్యాత్మిక మరియు మానసిక భౌతిక పద్ధతులు మరియు నియమాల ద్వారా ఒక వ్యక్తి యొక్క సహజ స్వభావాన్ని పెంపొందించి స్థిరపరిచే ప్రక్రియ.

ప్రతి వ్యక్తి తన కురుక్షేత్ర యుద్ధంలో తానే పోరాడాలి. ఈ యుద్ధం గెలవడానికి యోగ్యమని మాత్రమే కాదు, విశ్వ పరిణామ దివ్య క్రమంలో, ఆత్మ- పరమాత్మల మధ్య శాశ్వతమైన సంబంధ రీత్యా, ఇది త్వరగానో – ఆలస్యంగానో గెలిచి తీరవలసిన యుద్ధం.

పవిత్ర భగవద్గీతలో, ధ్యాన యోగం యొక్క దివ్య శాస్త్రాన్ని నిరుత్సాహపడని అభ్యాసం ద్వారా, ఆత్మ యొక్క అంతర్గత జ్ఞాన-గీతాన్ని వినడానికి అర్జునుడిలా నేర్చుకునే భక్తుడికి ఆ విజయాన్ని త్వరగా పొందడం నిశ్చయమవుతుంది.

గీత యొక్క సంతులిత మార్గం: ధ్యానం మరియు యుక్తమైన కర్మ

శ్రీకృష్ణుని జీవితం కర్మ సన్యాసం చేయకూడదనే ఆదర్శాన్ని ప్రదర్శిస్తుంది—కర్మయే జీవనాధారంగా గల ప్రపంచంలో ఉన్న మానవునికి అది విరుద్ధమైన సిద్ధాంతం—కానీ దానికంటే భూమికి బంధించే కర్మఫల వాంఛను త్యాగం చేయటం మేలు. నిరంతర ధ్యానం ద్వారా మనిషి తన దైనందిన జీవితంలో అవసరమైన విధులను నిర్వర్తిస్తూ కూడా అంతరంగంలో దైవ-చైతన్యమును నిలుపుకోగలగటం తన మనస్సుకు నేర్పించాలి…..

భగవద్గీతలోని శ్రీ కృష్ణుడి సందేశం ఆధునిక యుగానికి మరియు అన్ని యుగాలకు సరైన సమాధానం: నిర్మోహము విధిబద్ధము అయిన కర్మయోగం మరియు భగవత్సాక్షాత్కారం కోసం ధ్యానం. అంతరంగంలో భగవంతుని శాంతి లేకుండా పనిచేయడం అధమం; ఆత్మ ద్వారా ఆనందం ఎప్పుడూ ఉప్పొంగుతూ ఉండగా పని చేయడం అంటే ఎక్కడికి వెళ్ళినా లోపల చిన్న స్వర్గాన్ని తీసుకువెళ్ళడమే.

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు సూచించినది శ్రేష్ఠమైనది అయిన మధ్యేమార్గం. ఇది ప్రపంచంలోని తీరికలేని వ్యక్తికి, అత్యున్నత ఆధ్యాత్మిక అభిలాషికి కూడా తగినది. భగవద్గీత సూచించిన మార్గాన్ని అనుసరించిన వారికి మోక్షాన్ని కలుగజేస్తుంది. ఎందుకంటే ఇది ఆత్మ-సాక్షాత్కారానికి సంబంధించిన సార్వత్రిక పుస్తకం, ఇది మనిషికి తన నిజ స్వరూపమైన, ఆత్మను పరిచయం చేస్తుంది—తాను ఆత్మ నుండి ఎలా ఉద్భవించాడో, అతను భూమిపై ధర్మబద్ధమైన తన విధులను ఎలా నెరవేర్చాలో మరియు దేవుని వద్దకు ఎలా తిరిగి వెళ్ళాలో అతనికి చూపుతుంది. ప్రపంచంలో నివసిస్తున్న ఒక పురుషుడు లేదా స్త్రీ, గృహస్థుడు లేదా పరిత్యాగి కూడా యోగం యొక్క దశల వారీ పద్ధతులను అనుసరించడం ద్వారా, భగవంతునితో వాస్తవ సంబంధాన్ని కలిగి ఉన్న సంతులిత జీవితాన్ని ఎలా గడపాలో చూపించడానికే కాని, దాని మానసిక కసరత్తుల వినోదం కలిగించడానికి కాదు గీతా జ్ఞానం.

శాశ్వతమైన రాజయోగ శాస్త్రం

సృష్టి ప్రారంభంలో మరియు మానవుని ఆగమనంలో, అనంత పరమాత్మ వికర్షణ శక్తిని మాత్రమే కాకుండా—విశ్వ చైతన్యాన్ని ఆత్మలుగా మరియు పదార్థం యొక్క విశ్వంలోకి వ్యక్తీకరించడం—మరియు పదార్థ ప్రపంచంలో చిక్కుకుని తప్పిపోయిన ఆత్మలను తిరిగి పరమాత్మతో లయముకు సంబంధించిన అన్నీ అంశాలతో తన తెలివైన సృజనాత్మక విశ్వ శక్తిని (మహా-ప్రకృతి లేదా పవిత్రాత్మ) నింపాడు. అన్ని విషయాలు విశ్వశక్తి నుండీ వచ్చి, విశ్వశక్తి చే నిర్మితమై, దానిచే పోషించబడి, విశ్వశక్తిలోకి, ఆపైన పరమాత్మలోకి లీనమైపోతాయి. అధిరోహణ, అవరోహణకు సరిగ్గా విరుద్ధమైన క్రమమును అనుసరిస్తుంది. మనిషిలో, ఆ క్రమమే అనంతానికి ఆంతరంగికమైన రహదారి, అదే అన్ని యుగాలలో దివ్య-సంయోగానికి సర్వమతాల అనుయాయులు అనుసరించే ఏకైక మార్గం.

విశ్వాసాలు మరియు సాధనలలో ఏ ఇతర మార్గం ద్వారానైనా సాధకుడు ఈ ఏకైక రహదారికి చేరుకున్నా కూడా, శరీర స్పృహ నుండి ఆత్మకు చివరి అధిరోహణం అందరికీ ఒకేలా ఉంటుంది: జీవశక్తి మరియు చైతన్యము ఇంద్రియాల నుండి వెనక్కు మళ్ళి సూక్ష్మ చక్రాలనే మస్తిష్క-మేరు మండల కాంతి ద్వారాల గూండా పైకి ప్రయాణించి, పదార్థస్పృహను నిర్వీర్యము చేస్తూ జీవశక్తిలోకి, జీవశక్తి మనస్సులోకి, మనస్సు ఆత్మలోకి, మరియు ఆత్మ పరమాత్మలోకి లీనమైపోతాయి. ఈ అధిరోహణ పద్ధతే రాజయోగం, సృష్టి ఆరంభం నుండి అందులో అంతర్భాగంగా ఉన్న శాశ్వతమైన శాస్త్రం.

కృష్ణుడు అర్జునుడికి బోధించిన క్రియాయోగ ప్రక్రియ, గీత అధ్యాయాలు IV:29 మరియు V:27–28లో సూచించబడినది ఇదే, ధ్యాన యోగం యొక్క అత్యున్నతమైన ఆధ్యాత్మిక శాస్త్రం. భౌతిక యుగాలలో మరుగుపరచబడిన, ఈ నాశరహిత శాస్త్రం ఆధునిక మానవుల కొరకు మహావతార్ బాబాజీ ద్వారా పునరుద్ధరించబడింది మరియు సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్/యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా గురువులచే బోధించబడుతోంది. ఈ పవిత్రమైన దైవ-సంయోగ శాస్త్రాన్ని వ్యాప్తి చేయడానికి బాబాజీ స్వయంగా నన్ను (పరమహంస యోగానంద) నియమించారు….

ఆదర్శ శిష్యుని ప్రతిరూపమైన అర్జునుని అనుసరించి తన యుక్తమైన కర్తవ్యాన్ని నిర్మోహంతో నిర్వర్తించి, క్రియాయోగం వంటి పద్ధతి ద్వారా ధ్యాన యోగాన్ని పరిపూర్ణంగా సాధన చేసే భక్తుడు, అర్జునుడు పొందిన విధంగానే భగవంతుని ఆశీర్వాదం మరియు మార్గదర్శకత్వం పొంది ఆత్మసాక్షాత్కారంలో విజయం సాధిస్తాడు.

అర్జునుడితో భగవంతుడు ఎలా మాట్లాడాడో అలాగే మీతో కూడా మాట్లాడతాడు. ఆయన అర్జునుడి ఆత్మను మరియు చైతన్యాన్ని ఎలా ఉద్ధరించాడో, అలాగే మిమ్మల్ని కూడా ఉద్ధరిస్తాడు. అర్జునుడికి అత్యున్నత ఆధ్యాత్మిక దర్శనమును ఇచ్చినట్లుగానే, ఆయన మీకు జ్ఞానోదయం ప్రసాదిస్తాడు.

భగవద్గీతలో భగవంతుని వద్దకు తిరిగి ప్రయాణించే ఆత్మ కథను మనము చూశాము—ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయవలసిన ప్రయాణం అది. ఓ దివ్య ఆత్మ! అర్జునుడిలా, “ఈ చిన్న అల్ప-హృదయాన్ని (మర్త్య స్పృహ) విడిచిపెట్టండి. లేవండి!” మీ ముందు రాజమార్గం ఉన్నది.

గాడ్ టాక్స్ విత్ అర్జున లో శ్రీ శ్రీ పరమహంస యోగానందగారు వ్యాఖ్యానించినట్లుగా భగవద్గీతలోని జ్ఞానముపై వై.ఎస్.ఎస్. సీనియర్ సన్యాసుల ప్రసంగాలను వీక్షించడం కోసం క్రింద ఉన్న బటన్ క్లిక్ చేయండి:

కాలాతీతమైన పవిత్ర గ్రంథం యొక్క కాపీని మీరు పొందండి:

ఇతరులతో పంచుకోండి