ఆధునిక భారతదేశపు యోగి-క్రీస్తు (యోగీశ్వరులు) బాబాజీ

శ్రీ పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మకథ నుండి పునర్ముద్రించబడింది (అధ్యాయం 33)

బదరీనారాయణ క్షేత్రానికి సమీపంలో ఉన్న ఉత్తర హిమాలయ ప్రాంతం, బాబాజీ ఉనికితో ఈనాటికీ పునీతమవుతున్నది. బాబాజీ, లాహిరీ మహాశయుల గురుదేవులు. ఏకాంతవాసులయిన ఈ మహానుభావులు అనేక శతాబ్దులుగా – బహుశా అనేక సహస్రాబ్దులుగా – తమ భౌతికరూపాన్ని నిలుపుకొంటున్నారు. మరణంలేని బాబాజీ అవతారపురుషులు. సంస్కృతంలో అవతరించడం అంటే, “కిందికి దిగడం” అని అర్థం. అవతార శబ్దంలో ‘అవ’ అనే ఉపసర్గకు “కిందికి” అనీ, ‘తృ’ అనే ధాతువుకు “దాటడం” అనీ అర్థాలు. హిందూ పవిత్రగ్రంథాల్లో ఈ అవతారశబ్దం, దైవం భౌతిక శరీరరూపంలోకి దిగిరావడం అన్న అర్థాన్ని సూచిస్తుంది.

“బాబాజీ ఆధ్యాత్మిక స్థితి మానవావగాహనకు అందనిది,” అని నాకు వివరించారొకసారి శ్రీ యుక్తేశ్వర్ గారు. “మానవుల కుంచిత దృష్టి, ఈ మహాతీత నక్షత్రంలోకి చొరబారలేదు. అవతారపురుషుడి సంసిద్ధిని చిత్రించబోవడం కూడా వ్యర్థ ప్రయత్నమవుతుంది. అది అనూహ్యమైనది.”

ఆధ్యాత్మిక ప్రగతిలోని ప్రతి దశనూ ఉపనిషత్తులు సునిశితంగా వర్గీకరించాయి. సిద్ధుడు (“పరిపూర్ణత పొందినవాడు”) జీవన్ముక్త (“జీవించి ఉండగానే విముక్తి పొంది ఉన్నవాడు”) స్థితినుంచి పరాముక్త (“సర్వోత్కృష్ట స్వతంత్రుడు” –మృత్యుంజయుడు) స్థితికి పురోగమించి ఉంటాడు. చివర చెప్పిన ఈ పరాముక్తుడు మాయాబంధంలో౦చీ జన్మ పరంపరావృత్తి లో౦చీ పూర్తిగా బయటపడి ఉంటాడు. అందువల్ల పరాముక్తుడు తిరిగి భౌతిక శరీరం పొందడమనేది సకృతు. ఒకవేళ భౌతిక రూపంలో ఇలా తిరిగి రావడమే సంభవిస్తే అటువంటి వ్యక్తి అక్షరాలా అవతారపురుషుడే; ప్రపంచానికి దివ్యమయిన దీవెనలు కురిపించడానికి దైవనిర్ణీతమైన సాధనమే. అవతారపురుషుడు విశ్వవ్యవస్థకు బద్ధుడు కాడు; తేజోబింబంగా గోచరించే అతడి పరిశుద్ధ దేహం ప్రకృతికి ఏ విధంగానూ ఋణపడి ఉండదు.

సాధారణ దృష్టికి, అవతారమూర్తి రూపంలో అసాధారణమైనదేదీ అవుపించకపోవచ్చు. కాని ఒక్కొక్క సందర్భంలో దానికి నీడా పడదు, నేలమీద అడుగుజాడా పడదు. అంధకారాన్నించీ భౌతిక దాస్యాన్నించీ పొందిన ఆంతరిక స్వేచ్ఛకు బాహ్యమైన ప్రతీకలవంటి నిదర్శనాలివి. అటువంటి దైవ-మానవుడొక్కడే చావుపుట్టుకల సాపేక్షతల వెనక ఉన్న సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఎంతగానో అపార్థానికి గురి అయిన ఉమర్ ఖయ్యాం ‘రుబాయత్’ అనే అమర గ్రంథంలో ఈ విముక్త మానవుణ్ణి గురించి ఇలా గానం చేశాడు:

“ఆహా, కళలు తరగని నా ఆనంద చంద్రబింబం,
ఉదయిస్తో౦ది మళ్ళీ దివ్యే౦దుబింబం;
ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇకముందు
ఇదే ఉద్యానంలో – వ్యర్థంగా నా కోసం!”

“కళలు తరగని ఆనంద చంద్రబింబం,” అంటే భగవంతుడు; శాశ్వత ధ్రువతార; కాలక్రమమెన్నడూ తప్పనివాడు. మళ్ళీ ఉదయిస్తున్న “దివ్యే౦దుబింబం” అంటే బాహ్యప్రపంచం; నియతకాలిక పునరావర్తన నియమానికి బద్ధమయినది. ఈ పారశీక ద్రష్ట ఆత్మసాక్షాత్కారం ద్వారా ఈ భూమి మీద నిర్బంధ పునర్జన్మల శృ౦ఖలాలు తెంచుకొని శాశ్వతంగా విముక్తి సాధించినవాడు. ఇక్కడ భూమి అన్నది: ప్రకృతి అనే “ఉద్యానం” లేదా మాయ. “ఎంత తరచుగా ఉదయిస్తూ అన్వేషిస్తూ ఉంటుందో ఇక ముందు – వ్యర్థంగా నాకోసం!” పూర్తిగా లుప్తమయిన దానికోసం విస్మయంతో అన్వేషించే విశ్వం ఎంత నిస్పృహ చెందుతుందో పాపం!

క్రీస్తు తన విముక్తిని గురించి మరో రకంగా చెప్పాడు. “ఒకానొక లేఖరి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు – స్వామీ, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా మీ వెంట వస్తాను. అందుకు క్రీస్తు ఇలా అన్నాడు – గుంటనక్కలకు బొర్రెలున్నాయి; గాలిలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి; కాని మనుష్య కుమారుడికి తలదాచుకోడానికయినా చోటు లేదు.”

అంతటా తానే అయి ఉండేటట్లు విస్తరించి ఉన్న క్రీస్తును ఆత్మసాధనలో తప్ప మరోవిధంగా అనుసరించగలరా?

కృష్ణుడు, రాముడు, బుద్ధుడు, పతంజలి ప్రాచీన భారతీయ అవతార పురుషులు. దక్షిణ భారతీయ అవతారమూర్తి అయిన అగస్త్యుడి గురించి, చెప్పుకోదగ్గంత కావ్యసాహిత్యం తమిళంలో బయలుదేరింది. క్రీస్తుశకారంభానికి ముందూ ఆ తరవాతి శతాబ్దాల్లోనూ కూడా ఈయన అలౌకిక ఘటనలు అనేకం ప్రదర్శించాడు. ఆయన ఈనాటికీ భౌతిక రూపాన్ని నిలుపుకొనే ఉన్నట్టు ప్రతీతి.

ప్రత్యేక విధుల నిర్వహణలో ప్రవక్తలకు తోడ్పడ్డమే భారతదేశంలో బాబాజీ ధ్యేయం. ఈ విధంగా ఈయన, పవిత్ర గ్రంథాల వర్గీకరణ ప్రకారం మహావతారులనిపించుకోడానికి అర్హులు. సన్యాసుల మఠామ్నాయాన్ని పునర్వ్యవస్థీకరించిన శంకరాచార్యులవారికీ మధ్యయుగంలో ప్రసిద్ధుడైన గురువు కబీరుకూ తామే యోగదీక్ష ఇచ్చినట్టు చెప్పారు ఈయన. పందొమ్మిదో శతాబ్దిలో ఈయన శిష్యుల్లో ప్రముఖులు, మనకు తెలిసినంతవరకు, విస్మృతమయిన క్రియాకళని పునరుజ్జీవితం చేసిన, లాహిరీ మహాశయులు.

బాబాజీకి క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధముంటూనే ఉంది. వీరిద్దరూ కలసి ముక్తిప్రదమయిన స్పందనలను ప్రసరింప జేస్తూనే ఉంటారు. అంతే కాకుండా వీరు, ఈ యుగంలో మోక్షప్రాప్తి కోసం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియకు రూపకల్పన చేశారు. ఒకరు సశరీరులుగాను, మరొకరు అశరీరులుగాను ఉన్న ఈ సంపూర్ణ జ్ఞానసిద్ధులు చేసే పని ఏమిటంటే; యుద్ధాలనూ, జాతివిద్వేషాలనూ, మతపరమయిన పక్షపాతాన్నీ ప్రయోగించినవాళ్ళకే బెడిసికొట్టే భౌతికవాద దుష్పరిణామాలనూ విడిచిపెట్టవలసిందిగా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం. ఆధునిక యుగ ధోరణి బాబాజీకి బాగా తెలుసు; ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతలోని క్లిష్టతల ప్రభావం ఇంకా బాగా తెలుసు. అంతే కాదు, యోగపరమయిన ఆత్మవిమోచన పద్ధతులను ప్రాచ్య, పాశ్చాత్య దేశాలన్నిటా సమంగా వ్యాప్తి చెయ్యవలసిన అవసరాన్ని గ్రహించారాయన.

బాబాజీని గురించి ఎక్కడా ఎటువంటి చారిత్రక ప్రస్తావనా లేకపోయినందుకు మనం ఆశ్చర్యపోనక్కరలేదు. ఈ గొప్ప పరమోత్కృష్ట గురుదేవులు ఏ శతాబ్దిలోనూ ఎన్నడూ బహిరంగంగా దర్శనమియ్యలేదు. తప్పుడు వ్యాఖ్యానాలు చేసే ప్రచారాడంబరానికి వీరి సహస్రవర్ష ప్రణాళికలో స్థానం లేదు. ఏకైక నీరవశక్తి అయిన సృష్టికర్త మాదిరిగానే బాబాజీ వినమ్రంగా మరుగున ఉండి పనిచేస్తూ ఉంటారు.

క్రీస్తు, కృష్ణుడు వంటి మహాప్రవక్తలు ఒకానొక విలక్షణమయిన ఒక నిర్దిష్టమైన మరియు ఆసక్తికరమైన ప్రయోజనం కోసం భూమిపై అవతరిస్తూ ఉంటారు; వచ్చిన పని నెరవేరడంతోటే నిష్క్రమిస్తూ ఉంటారు. బాబాజీవంటి ఇతర అవతారపురుషులు, చరిత్రలో ప్రసిద్ధికెక్కే ప్రముఖమైన ఒక మహాసంఘటనకు కాక, కొన్ని శతాబ్దుల తరబడి నిదానంగా సాగే మానవ పరిణామాత్మక ప్రగతికి సంబంధించిన పని చేపడతారు. అటువంటి మహాపురుషులు జనసామాన్యం స్థూలదృష్టికి అతీతంగా తెర మరుగున ఉంటారు. ఇచ్ఛానుసారంగా కనుమరుగయే శక్తి వారికి ఉంటుంది. ఈ కారణాలవల్లా, తమను గురించి ఎవరికీ ఏమీ చెప్పవద్దని శిష్యుల్ని మామూలుగా హెచ్చరిస్తూ ఉండడంవల్లా, చాలామంది ఆధ్యాత్మిక మహామేరుసదృశులు ప్రపంచానికి అజ్ఞాతంగానే ఉండిపోతారు. ఈ పుటల్లో నేను ఇయ్యదలచినది కేవలం, బాబాజీ జీవితాన్ని గురించిన సూచన మాత్రమే; బహిరంగంగా తెలపడానికి తగినవీ సహాయకరమైనవీ అని బాబాజీ తలచిన కొన్ని వాస్తవాలు మాత్రమే.

బాబాజీ కుటుంబాన్ని గురించి కాని, జన్మస్థలాన్ని గురించి కాని చరిత్రకారునికి ప్రీతిపాత్రమయే పరిమితి విధించే వాస్తవాలేవీ వెల్లడి కాలేదు. ఆయన మాట్లాడేది సాధారణంగా హిందీలో; కాని ఏ భాషలో నయినా అవలీలగా మాట్లాడగలరు. ఈయన తను బాబాజీ అన్న సరళమైన పేరు పెట్టుకొన్నారు; ఇది కాక లాహిరీ మహాశయుల శిష్యులు ఇచ్చిన గౌరవ బిరుదులు ఇవి: మహాముని బాబాజీ మహారాజ్ (పరమానందమగ్నులయిన సాధువు), మహాయోగి (యోగులందరిలోకి గొప్పవారు), త్ర్యంబక బాబా లేదా శివబాబా (శివుడి అవతారమనే అర్థంలో). అన్ని బంధాలనుంచీ విముక్తులయిన ఈ మహాగురువుల గోత్రనామాలేవో తెలియకపోతే నష్టమేమిటి?

“ఎప్పుడయినా, ఎవరయినా భక్తితో బాబాజీ పేరు పలికినట్లయితే ఆ భక్తుడికి తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది,” అన్నారు లాహిరీ మహాశయులు.

మృత్యుంజయులయిన ఈ మహాగురువుల దేహం మీద వయస్సును తెలిపే చిహ్నాలేవీ ఉండవు; పాతికేళ్ళకు మించని యువకుడిలా కనిపిస్తారు. పసిమిఛాయ, నడితరం పుష్టీ మధ్యస్థ నిర్మాణము మరియు ఎత్తూ గల బాబాజీ సుందర దృఢకాయం దృగ్గోచరమయే తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆయన కళ్ళు నల్లటివి; ప్రశాంతంగా, ప్రేమార్ద్రతతో సున్నితంగా ప్రసన్నంగా ఉంటాయి. నిగనిగలాడే ఆయన పొడుగాటి జుట్టు రాగివన్నెలో ఉంటుంది. ఒక్కొక్కప్పుడు బాబాజీ ముఖంలో లాహిరీ మహాశయులకు ఎంత దగ్గరి పోలిక కనిపిస్తుందంటే, కడపటి ఏళ్ళలో లాహిరీ మహాశయులు, యువకుడిలా కనిపించే బాబాజీకి తండ్రిగా కూడా చెలామణి కాగలిగేటట్టు ఉండేవారు.

ఋషితుల్యులయిన నా సంస్కృత భాషాధ్యాపకులు స్వామి కేవలానందగారు బాబాజీతో కొంతకాలం హిమాలయాల్లో గడిపారు.

“సాటిలేని ఈ పరమ గురువులు, తమ బృ౦దంతో కలిసి హిమాలయాల్లో ఒకచోటి నుంచి మరోచోటికి సంచరిస్తూ ఉంటారు,” అన్నారు కేవలానందగారు నాతో. “ఆయనతోబాటు ఉండే చిన్న బృ౦దంలో, ఆధ్యాత్మికంగా గొప్ప ప్రగతి సాధించిన అమెరికన్ శిష్యులు ఇద్దరున్నారు. ఒక ప్రదేశంలో కొంతకాలమున్నాక బాబాజీ, ‘డేరా డండా ఉఠావో’ (‘ఇంక బిచాణా ఎత్తేద్దాం’) అంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ ఒక ‘దండం’ (వెదురు కర్ర) ఉంటుంది. ఆయన మాటలు, తమ బృ౦దం తక్షణమే మరోచోటికి మారడానికి సూచన. ఆయన ప్రతి మాటూ సూక్ష్మయాన పద్ధతిని అనుసరించరు; ఒక్కొక్కప్పుడు ఒక కొండమీంచి మరో కొండకొమ్ము మీదికి కాలినడకనే వెళ్తూంటారు.

“బాబాజీ కోరినప్పుడే ఆయన ఇతరులకు కనబడడం కాని వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టడం కాని జరుగుతుంది. వేరు వేరు భక్తులకు ఆయన, కొద్దిపాటి తేడాగల వేరువేరు రూపాల్లో కనిపించినట్టుగా చెప్తారు – ఒక్కొక్కప్పుడు గడ్డం, మీసాలతో; మరొకప్పుడు అవి లేకుండా. చ్యుతిలేని ఆయన దేహానికి ఆహారమక్కర్లేదు; అంచేత ఆ మహాగురువులు అరుదుగా భోజనం చేస్తారు. సందర్శించే శిష్యులపట్ల సాంఘిక మర్యాదకోసం ఆయన, అప్పుడప్పుడు పళ్ళో, పాలూ నెయ్యీ పోసి వండిన పరమాన్నమో తీసుకునేవారు.

“బాబాజీ జీవితంలోని ఆశ్చర్యకరమయిన సంఘటనలు రెండు తెలుసు నాకు,” అంటూ చెప్పుకొచ్చారు, కేవలానందగారు. “ఒకనాటి రాత్రి ఆయన శిష్యులు, పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు, మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజంమీద కొట్టారు.

“‘స్వామీ ఎంత క్రూరం!’ అన్నారు నిందపూర్వకంగా ఆక్షేపణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.

“‘అయితే ఇతను, తన పూర్వకర్మఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా?’

“ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజంమీద ఉపశమన దాయకమయిన తమ చెయ్యి వేశారు. ‘ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువునుంచి తప్పించాను. నిప్పుసెగవల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది’ అన్నారాయన.

“మరో సందర్భంలో బాబాజీ పవిత్ర బృ౦దం దగ్గరికి ఒక ఆగంతకుడు రావడంవల్ల ప్రశాంతతకు భంగం కలిగింది. గురుదేవులు బసచేసిన చోటికి దగ్గరగా, చేరడానికి దాదాపు అశక్యమయిన కొండ కొనకొమ్ముకు ఆశ్చర్యం కలిగించేటంత నేర్పుతో అతడు ఎక్కి వచ్చాడు.

“‘స్వామీ, బాబాజీ అనే మహానుభావులు మీరే అయి ఉండాలి,’ ఆ వ్యక్తి ముఖంలో మాటలకందని భక్తిప్రపత్తులు వెలుగొందాయి. ‘మీకోసం, చేరరాని ఈ కోసుగుట్టల్లో నెలలు తరబడిగా అంతులేకుండా వెతుకుతున్నాను. నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని వేడుకొంటున్నాను,’ అన్నాడు.

“మహాగురువులు మారు పలకకపోయేసరికి అతడు, కొండకొమ్ముకు దిగువనున్న బండల వరసవేపు చూపించాడు. ‘మీరు నన్ను స్వీకరించని పక్షంలో ఈ కొండమీంచి దూకేస్తాను. దైవాన్వేషణలో నేను మీ గురుత్వం పొందలేక పోయినట్లయితే నా జీవితం నిరర్థకం.’

“‘అయితే దూకు,’ అన్నారు బాబాజీ, ఏ మాత్రం ఉద్రేకం లేకుండా. ‘నీ ప్రస్తుత పరిస్థితిలో నిన్ను నేను స్వీకరించలేను.’

“వెంటనే ఆ మనిషి కొండమీంచి దూకేశాడు. అది చూసి శిష్యులు కొయ్యబారి పోయారు. బాబాజీ వాళ్ళవేపు చూసి, ఆ ఆగంతకుడి కాయాన్ని తీసుకురమ్మని చెప్పారు. చితికిన కాయాన్ని తెచ్చి శిష్యులు ఎదురుగా పెట్టగానే మహాగురువులు, దానిమీద తమ చెయ్యి వేశారు. వెంటనే, చనిపోయినవాడు కళ్ళు విప్పి సర్వశక్తిమంతులయిన గురుదేవుల ముందు సవినయంగా సాష్టాంగ దండప్రణామం చేశాడు.

“‘ఇప్పుడు పనికొస్తావు నువ్వు, శిష్యరికానికి,’ అంటూ బాబాజీ, మళ్ళీ బతికిన శిష్యుడివేపు ఆప్యాయంగా చూశారు. ‘కఠినమయిన పరీక్షను ధైర్యంగా ఎదుర్కొని కృతార్థుడివయావు నువ్వు. చావన్నది మరి మళ్ళీ తాకదు నిన్ను; నువ్విప్ప్పుడు మా అమరబృ౦దంలో ఒకడివి,’ అన్నారు. ఆ తరవాత, అలవాటు ప్రకారం, ‘డేరా డండా ఉఠావో’ అంటూ బయలుదేరమన్నారు. మరుక్షణంలో వారి బృ౦దమంతా కొండమీంచి మాయమయింది.”

అవతారపురుషుడు సర్వవ్యాపకమయిన ఆత్మలో వసిస్తాడు. నాలుగుదిశల మధ్య దూరభావం ఆయనకు ఉండదు. కాబట్టి బాబాజీ శతాబ్దాల తరబడిగా తమ భౌతిక రూపాన్ని నిలుపుకోడానికి ప్రేరణ కలిగించిన ఒకే ఒక కారణం ఏమిటంటే: మానవజాతికి గల సాధ్యాలకు వాస్తవ నిదర్శనం ఒకటి చూపించాలన్న కోరిక. దైవత్వాన్ని మాంసల (మానవ) రూపంలో దర్శించే అవకాశం కనక మనిషికి లేకపోయినట్లయితే, మర్త్యత్వాన్ని అధిగమించలేమనే భారమైన మాయాభ్రాంతి అతన్ని అణచిపెట్టి ఉంచుతుంది.

ఏసుక్రీస్తుకు తన జీవిత క్రమమేమిటో మొదటినుంచి తెలుసు. తన జీవితంలోని ప్రతి ఒక్క సంఘటననూ ఆయన అనుభవించింది తన కోసమూ కాదు, కర్మనిర్బంధంవల్లా కాదు; చింతనాపరులయిన మానవుల ఉద్ధరణ కోసమే వాటిని అనుభవించాడు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తికులు (ఇవాంజిలిస్టులు) నలుగురూ భావితరాలవారి ఉపయోగార్థం ఆ అద్భుత జీవిత నాటకాన్ని గ్రంథస్థంచేశారు.

భూతభవిష్యద్వర్తమానాల సాపేక్షత కూడా బాబాజీకి లేదు. ఆయనకు తమ జీవిత దశలన్నీ మొదటినుంచి తెలుసు. మానవుల పరిమిత అవగాహనశక్తికి అనుగుణంగా బాబాజీ, తమ దివ్యజీవన చర్యలనేకం, ఒకరు లేదా అంతకన్న ఎక్కువమంది సమక్షంలో నిర్వహించారు. ఆ విధంగా, శారీరకమైన అమరత్వానికున్న అవకాశాన్ని తాము ప్రకటించడానికి సమయం ఆసన్నమయిందని బాబాజీ భావించినప్పుడు లాహిరీ మహాశయుల శిష్యులొకరు వారి సన్నిధిలో ఉండడం తటస్థించింది. తామిచ్చే హామీ ఇతర అన్వేషక హృదయాలకు స్ఫూర్తి నిస్తుందన్న ప్రసిద్ధి చివరికి పొందాలని బాబాజీ, శ్రీరామగోపాల్ మజుందార్ గారు ఉండగా ఈ హామీ ప్రకటించారు. మహాత్ములెప్పుడూ తమ మాటలు చెబుతూ, పైకి సహజంగా కనిపించే జీవిత వ్యాసంగాల్లో పాల్గొంటూ ఉంటారు – ఇది కేవలం మానవ శ్రేయస్సుకోసం. క్రీస్తు కూడా ఇలా అన్నాడు: “తండ్రీ, నా మనవి నువ్వెప్పుడూ ఆలకిస్తూనే ఉంటావని నాకు తెలుసు: కాని నువ్వే నన్ను పంపావన్న విషయంలో చుట్టూ ఉన్నవాళ్ళకి నమ్మకం కలగాలని వాళ్ళకోసమే ఈ మాట చెప్పాను.”

రణబాజ్ పూర్ లో, “నిద్రపోని సాధువు” అయిన రామగోపాల్ మజుందార్ గారిని సందర్శించిన సందర్భంలో ఆయన, బాబాజీని తాము మొట్టమొదటిసారి కలుసుకోడానికి సంబంధించిన అద్భుత కథ ఇలా చెప్పారు:

“కాశీలో లాహిరీ మహశయుల పాదసన్నిధిలో కూర్చోడంకోసం ఒక్కొక్కప్పుడు నేను, ఏకాంతగుహను విడిచి వస్తూ ఉండేవాణ్ణి,” అన్నారు రామగోపాల్ గారు నాతో. “ఒకనాడు నడిరాత్రివేళ వారి శిష్యబృ౦దంతోబాటు కూర్చుని ధ్యానం చేసుకొంటూ ఉండగా గురుదేవులు ఆశ్చర్యకరమయిన కోరిక ఒకటి కోరారు.

“‘రామగోపాల్, వెంటనే నువ్వు దశాశ్వమేధ స్నాన ఘట్టానికి వెళ్ళు,’ అన్నారు లాహిరీ మహాశయులు.

“వెంటనే నేను ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాను. ఆ రాత్రివేళ, వెన్నెలతోను మిలమిల మెరిసే చుక్కలతోను ప్రకాశిస్తున్నది. కొంతసేపు ఓపికగా, మౌనంగా కూర్చున్నాను. ఇంతలో నా పాదాలకు దగ్గరిలోనే ఉన్న ఒక పెద్ద రాతిపలకమీద నా చూపు నిలిచింది. అది మెల్లమెల్లగా లేచినప్పుడు, దానికింద భూమిలో ఒక గుహ ఉన్నట్టు వెల్లడి అయింది. ఏ అజ్ఞాత సాధనంవల్లనో పైకి లేచిన రాయి కదలడం మానేసిన తరవాత, ఆశ్చర్యం కలిగించేటంత అందమయిన ఒక యువతి ఆచ్ఛాదిత రూపం, ఆ గుహలో౦చి బయటికి వెలువడి గాలిలో తేలింది. చుట్టూ మృదువయిన కాంతిపరివేషం గోచరిస్తూ ఉండగా ఆమె, మెల్లగా నేలకు దిగి వచ్చి ఒకానొక పారవశ్యంలో మునిగి ఉండి నా ముందు నిశ్చలంగా నిలిచారు. చివరికామె కదిలి మెల్లగా ఇలా అన్నారు:

“నేను మాతాజీని – బాబాజీ చెల్లెల్ని, ఈ రాత్రి గొప్ప ప్రాముఖ్యం గల ఒక విషయాన్ని చర్చించడానికి ఆయన్నీ లాహిరీ మహాశయుల్నీ నా గుహ దగ్గరికి రమ్మని కోరాను.’

“ఇంతలో, వెండిమబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగానదిమీద త్వరితగతిన తేలుతూ వస్తున్నట్టు కనిపించింది. పారదర్శకం కాని నీళ్ళమీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తో౦ది. అది దగ్గరికి వచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది. ఆ మహాయోగిని పాదాలకు వినమ్రులయి నమస్కరించారాయన.

“నేను దిగ్భ్రమనుంచి ఇంకా తేరుకోకముందే ఆకాశంలో పరిభ్రమిస్తూ వస్తున్న ఒక అలౌకిక తేజోబింబాన్ని చూసి మరింత ఆశ్చర్యపోయాను. వడివడిగా దిగుతూ ఆ తేజోవలయం, మా సమూహానికి దగ్గరిగా వచ్చి ఒక అందమయిన యువకుడిలా ఆకృతి దాల్చింది. ఆయన బాబాజీ అని నాకు తక్షణమే అర్థమయింది. ఆయన లాహిరీ మహశయుల్ని పోలి ఉన్నారు; అయితే తమ శిష్యుడికంటె చాలా వయసు తక్కువ వారిగా ఉన్నారు; నిగనిగలాడే పొడవైన జుట్టు వారిది.

“లాహిరీ మహాశయులూ, మాతాజీ, నేనూ, మహాగురువుల పాదాలకు ప్రణామంచేశాం. ఆయన దివ్యశరీరాన్ని తాకేసరికి నాలోని అణువణువూ పరమానందానుభూతితో పరవశమయింది.

“‘నేను నా రూపాన్ని విడిచి అనంత దైవవాహినిలోకి దూకుదామనుకుంటున్నాను,’ అన్నారు బాబాజీ.

“‘ప్రియ గురుదేవా, మీ ఆలోచన నేను ముందే తెలుసుకున్నాను. ఆ విషయమే ఈ రాత్రి మీతో మాట్లాడాలనుకున్నాను. మీరు శరీరాన్ని ఎందుకు విడవాలి?’ ఆ మహితాత్మురాలు ఆయనవైపు ప్రార్థనాపూర్వకంగా చూశారు.

“నా ఆత్మసాగరంమీద నేను, కంటికి కనిపించే అలరూపాన్ని ధరిస్తే నేమి, కనిపించని అలరూపాన్ని ధరిస్తే నేమి? తేడా ఏముంటుంది?

“వెంటనే మాతాజీ, ‘అమర గురుదేవా, అటువంటి తేడా ఏమీ లేనప్పుడు, దయచేసి మీ రూపాన్ని ఎన్నటికీ విడవకండి,’ అన్నారు ఛలోక్తిగా.

“‘తథాస్తు,’ అన్నారు బాబాజీ, గంభీరంగా. ‘నా భౌతిక శరీరాన్ని ఎన్నటికీ విడవను. ఇది భూమిమీద కనీసం కొద్దిమందికి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. భగవంతుడు తన ఆకాంక్షను నీ నోటిమీదగా చెప్పించాడు.’

“ఆ మహానుభావుల సంభాషణను భయభక్తులతో వింటూ ఉండగా పరమ గురుదేవులు, ప్రసన్నంగా నావేపు తిరిగారు.

“‘భయపడకు రామగోపాల్, ఈ అమర వాగ్దాన ఘట్టానికి నువ్వొక సాక్షిగా ఉండి ధన్యుడివయావు,’ అన్నారాయన.

“బాబాజీ మృదుమధురస్వరం ఆగిపోతూ ఉండగా ఆయన రూపమూ, లాహిరీ మహాశయుల రూపమూ, మెల్లగా పైకి గాలిలో తేలి వెనక్కి గంగానదివేపు కదిలాయి. ఆ రాత్రిపూట ఆకాశంలో వారు అదృశ్యులవుతూ ఉండగా, వారి దేహాల చుట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతిపుంజం వెలుగొందింది. మాతాజీ రూపం గుహ దగ్గరికి తేలుతూ సాగి గుహలోకి దిగింది. రాతిపలక మళ్ళీ, కిందికి వచ్చి, కంటికి కనిపించని చేతులు కదిల్చినట్లుగా కదిలి ఆగుహను మూసేసింది.

“అనంతమైన ఉత్తేజం పొంది నేను తిరిగి లాహిరీ మహాశయుల నివాసానికి దారి తీశాను. వేకువ సంజెలో ఆయన ముందు మోకరిల్లుతూ ఉండగా గురుదేవులు భావగర్భితంగా చిరునవ్వు నవ్వారు.

“‘చాలా సంతోషం రామగోపాల్,’ అన్నారాయన. ‘బాబాజీనీ, మాతాజీనీ దర్శనం చేసుకోవాలని నువ్వు తరచుగా వ్యక్తం చేస్తూ వచ్చిన కోరిక చివరికి అద్భుతంగా నెరవేరింది.’

“నడిరాత్రి వేళ నేను ఇక్కణ్ణించి వెళ్ళినప్పటినించి లాహిరీ మహాశయులు తమ వేదికమీంచి కదలలేదని నా సహాధ్యాయులు చెప్పారు.

“‘నువ్వు దశాశ్వమేధ ఘట్టానికి వెళ్ళిన తరవాత ఆయన, అమరత్వాన్ని గురించి అద్భుతంగా ప్రసంగించారు,’ అన్నాడొక శిష్యుడు. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి ఒకే సమయంలో వేరు వేరు చోట్ల, రెండు శరీరాలతోనో అంతకంటె ఎక్కువ శరీరాలతోనో కనిపిస్తూ ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పే సత్యాన్ని మొట్టమొదటిసారిగా పూర్తిగా అప్పుడే అవగాహన చేసుకున్నాను.

“ఈ భూమికి సంబంధించిన గుప్తమయిన దివ్యప్రణాళికలోని అధిభౌతికాంశాలను లాహిరీ మహాశయులు, తరవాత నాకు వివరించారు,” అంటూ ముగించారు రామగోపాల్ గారు. “ప్రత్యేకించి ఈ ప్రపంచావధి పర్యంతం తమ శరీరాన్ని నిలుపుకొని ఉండటానికి భగవంతుడు నిర్ణయించిన వ్యక్తి బాబాజీ. యుగాలు వస్తూంటాయి, పోతూంటాయి – అయినప్పటికీ మరణంలేని ఈ మహాగురువులు, ప్రపంచరంగం మీద శతాబ్దాల తరబడిగా సాగుతూండే నాటకాన్ని తిలకిస్తూనే ఉంటారు.”

బాబాజీ
ఒక మహావతార్, “దివ్య అవతారం”
లాహిరీ మహాశయుల గురువు

ఆధునిక భారతదేశపు గొప్ప యోగి-క్రీస్తు యొక్క ఈ నిజమైన పోలికను చిత్రించడానికి, యోగానందగారు ఒక కళాకారుడికి సహాయం చేసారు.

మహావతార్ బాబాజీ తన శిష్యులకు తన జన్మస్థలం మరియు పుట్టిన తేదీ గురించి పరిమిత వాస్తవాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఆయన హిమాలయ మంచుల మధ్య అనేక శతాబ్దాలుగా నివసించారు.

లాహిరీ మహాశయులు అన్నారు, “ఎవరైనా బాబాజీ పేరును భక్తితో ఉచ్చరించినప్పుడల్లా, ఆ భక్తుడు తక్షణ ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని పొందుతాడు.”

ఇతరులతో పంచుకోండి